'నారాయణకి అన్ని ఆస్తులా, ఓటుకు నోటు కోసం రేవంత్లా వేషమేయించారా'
రాజమండ్రి: మంత్రి నారాయణ తనకు రూ.474 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారని, అంత ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం నాడు డిమాండ్ చేశారు. నారాయణ సీఎం చంద్రబాబుకు కుడి, ఎడమ చేతులు అంటుంటారన్నారు.
అలాంటప్పుడు నవ్యాంధ్ర రాజధాని అమరావతి కుంభకోణం సూత్రధారి ఆయనేనా అని ప్రశ్నించారు. ఆ అనుమానాలు తొలగాలంటే ఆన తన ఆస్తుల గుట్టు విప్పాలన్నారు. చంద్రబాబు పదేపదే సింగపూర్ వెళ్లడం వెనుక కారణం ఏమిటన్నారు. దొంగ సొమ్ము దాచుకునేందుకు అనువైన దేశాల్లో సింగపూర్ నాలుగో స్థానంలో ఉందన్నారు.

రేవంత్ రెడ్డి ప్రస్తావన
చంద్రబాబు తాను నిప్పు అని చెబుతుంటారని, రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుంటే మీరు ఎంత నిప్పో అందరూ చూసారని ఎద్దేవా చేశారు. ఆయన రేవంత్ రెడ్డి కాదనుకుంటే, కేసీఆర్ ఎవరికి వేషం వేసి ఆ డబ్బులు పంపించారో చెప్పాలన్నారు.
సాధారణంగా ఎవరైనా పని ప్రారంభిస్తే నారాయణ అని అనుకుంటామని, ఇప్పుడు మంత్రి నారాయణ కూడా తన ఆస్తులను వెల్లడించడం ద్వారా మంచికి నాంది పలకాలన్నారు. నారాయణ ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులు కూడబెట్టారో చెప్పాలన్నారు. సొసైటీలకు ఆస్తులు ఉండవచ్చునని, కానీ సొసైటీలు నడిపే వారికి అన్ని ఆస్తులు ఉండవన్నారు. సొసైటీ చట్టం ప్రకారం లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థలను నడపాలన్నారు.
గుంటూరు - కృష్ణా మధ్య రాజధాని వద్దని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని, అయినా ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలన్నారు. వ్యాపారవేత్తలైన నారాయణ, జయదేవ్, సుజనా చౌదరితో కమిటీ వేసి రాజధాని అమరావతి అని చెప్పించారని, తాను ప్రశ్నిస్తున్నందున తనను ఊసరవెల్లి అంటూ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.












Click it and Unblock the Notifications