టిడిపి వికెట్లు పడటం ఖాయం: ఉండవల్లి షాకింగ్, ఓటుకు నోటు నుంచి రేవంత్ బయటపడాలంటే..
రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018 బడ్జెట్ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎన్ని వికెట్లు పడతాయో అందరూ చూస్తారని షాకింగ్ ప్రకటన చేశారు.
సీనియర్ జర్నలిస్టు ఏబీకే వంటి వారిని ఉన్మాదితో పోల్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే అన్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం వ్యవహారంలో మంత్రి యనమల రామకృష్ణుడు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నారు.
'సవాల్.. సత్తా చాటుతావా! చంద్రబాబుకు ఉన్న దమ్ము, జగన్కు లేదు'అలాగే ఎలాంటి హక్కు లేని మండలి సభ్యుడు యనమల అన్నారు. అలాంటి వ్యక్తి నిబంధనల గురించి మాట్లాడటం సరికాదన్నారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న స్పీకర్ కోడెల శివప్రసాద రావు కుర్చీలో కూర్చోవడం మరో ఉల్లంఘన అన్నారు.
ప్రజాస్వామ్యంలో సభలు, సమావేశాలే అభిప్రాయ వేదికలని, నేను ఏ పార్టీలోనూ చేరడం లేదని తేల్చి చెప్పారు. ఈ వయసులో కమ్యూనిస్టు పార్టీలో చేరి ఆ రాజకీయాలను ఒంట బట్టించుకోలేనన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయ పరిస్థితులు ఊహించడం బ్రహ్మంగారికి కూడా సాధ్యం కాదన్నారు.
ఇరు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు అంశం పైన కూడా ఆయన స్పందించారు. తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన డూప్ చేయించుకుంటే తప్ప ఆ కేసు నుంచి బయటపడడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.