UNION BUDGET 2020- 2021 ..ఈ సారైనా ఆర్ధిక కష్టాల నుండి ఏపీ గట్టేక్కేలా కేంద్రం కరుణిస్తుందా.. ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీకల్లోతు ఆర్ధిక కష్టాల్లో ఉంది . కేంద్రం కరుణిస్తుంది అని ఆశగా ఎదురు చూస్తుంది. నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో బడ్జెట్ లో ఏపీ కేటాయింపులపై గంపెడాశలు పెట్టుకుంది . ఏపీలో రెండు తెలుగు రాష్ట్రాలు విభజన జరిగి ఇంత కాలం అయినా విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. లోటు బడ్జెట్ రాష్ట్రంగా ప్రయాణం ప్రారంభించిన ఏపీ ఇంకా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. ఏపీకి రావాల్సిన పెండింగ్ గ్రాంట్లు కూడా రాక ఏపీ సర్కార్ కుదేలవుతుంది . ఇక నేటి బడ్జెట్ కేటాయింపులపై ఆశగా ఎదురు చూస్తుంది.
ఆర్ధిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన చాలా హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదు. ఆర్ధిక చేయూత ఇస్తామని చెప్పినా ఇప్పటివరకు కేంద్రం అంతగా చేయూతనిచ్చిన దాఖలాలు లేవు . పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కూడా అటు ఇటు కాకుండా మధ్యలోనే ఆగింది. నీతిఆయోగ్ సిఫార్సులను కూడా కేంద్రం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణా రాష్ట్రంతో పోలిస్తే మరింత ఆర్ధిక భారంతో ఇబ్బంది పడుతుంది.
వెనుకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్న కేంద్రం
గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వలేదన్నది వాస్తవం . విభజన చట్టం ప్రకారం తమకు ఇవ్వాల్సిన నిధులు ఇప్పటికీ ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం లబోదిబోమంటుంది. వెనుకబడిన జిల్లాలకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉండగా మొదటి మూడేళ్లు కొంత సొమ్ము ఇచ్చినా , నాలుగో ఏడాది ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంది. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం కోసం కూడా కేంద్ర సాయం అవసరం . కానీ రాజధాని విషయంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో గందరగోళం కొనసాగుతోంది.
నీతిఆయోగ్ సిఫార్స్ చేసిన 666 కోట్ల రూపాయలు ఊసే ఎత్తని కేంద్రం
ఇక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏపీకి నీతిఆయోగ్ సిఫార్స్ చేసిన 666 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.. గత సంవత్సరం డిసెంబర్లో కేంద్ర ఆర్ధిక సంఘం పర్యటించినప్పుడు రాజధాని కోసం ప్రభుత్వం రూ. 47, 424 కోట్లు ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంది. ఆ మేరకు నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరింది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ గ్రాంట్లను విడుదల చెయ్యాల్సి ఉంది.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఖర్చు చేసిన 3, 283 కోట్ల రూపాయల కోసం ఎదురుచూపు
పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కట్టబెట్టినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. జలాశయం నిర్మాణ వ్యయం మొత్తం బాధ్యత కేంద్రానిదే అయినా కేంద్రం పట్టించుకోవటం లేదు . కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన 3, 283 కోట్ల రూపాయలను కేంద్రం రీయింబర్స్మెంట్ చేయాలని అడుగుతుంది ఏపీ సర్కార్ . పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55, 548 కోట్లను ఆమోదించాలని సైతం ఎదురు చూస్తుంది .
రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రావాల్సిన 18, 969 కోట్ల రూపాయల బకాయిలు
అంతే కాదు రెవెన్యూ లోటు గ్రాంట్ కింద రాష్ట్రానికి రావాల్సిన 18, 969 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాలని కోరుతుంది . వెనకబడిన జిల్లాలకు రూ. 23 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది . రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని ఈ బడ్జెట్ లో అలాంటి కేటాయింపు ఏమైనా ఉంటుందా అని ఆశగా చూస్తుంది . రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని అప్పుడే ఏపీ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్న నేపధ్యంలో కేంద్రం నేటి బడ్జెట్ లో ఏం చెయ్యనుందో.
మాంద్యం ఎఫెక్ట్ తో ఆశించినమేర పన్నుల వసూలు లేదు
ఇక పన్నుల వాటా కింద రాష్ట్ర అంచనాలు ఆశించిన స్థాయిలో లేవు . మాంద్యం కారణంగా రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు కొంతమేర తగ్గిన నేపథ్యంలో పన్నులు కూడా పెద్దగా వసూలు కాలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా విభజన తర్వాత నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ఆర్ధిక కష్టాలతో సతమతమవుతుంది. ఈ నేపధ్యంలోనే నేటి కేంద్ర బడ్జెట్ పై గంపెడు ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది.