మోడీని ఒప్పించి ఉత్తరాంధ్రకు శుభవార్తను మోసుకొచ్చిన రామ్మోహన్నాయుడు
ఏపీ రాజధాని అమరావతి కోసం కేంద్ర రైల్వే శాఖ 56 కిలోమీటర్లతో కొత్త రైల్వేలైను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రేపో మాపో పనులు ప్రారంభం కానున్నాయి. ఇది కాకుండా ఏపీలోనే మరో కొత్త రైలు మార్గం అందుబాటులోకి రాబోతోంది. కొన్ని సంవత్సరాలుగా ప్రతిపాదనలకే సిద్ధమైన ఈ రైల్వే లైను విషయంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సమయంలో విజయనగరం ఎంపీ అప్పలనాయుడిని కూడా వెంటపెట్టుకొని రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ను కలిసిన సంగతి తెలిసిందే.
గిరిజన ప్రాంతాలను కలుపుతూ..
అతి త్వరలోనే ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాలను, ఒడిసాలోని గిరిజన ప్రాంతాలను కలుపుతూ కొత్త రైల్వే మార్గానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపబోతోంది. చీపురుపల్లి, రాజాం, సీతంపేట, కొత్తూరుతోపాటు ఒడిసాలోని పర్లాకిమిడి, పరిసర ప్రాంతాలను కలుపుతూ మెళియాపుట్టి నుంచి ప్రధాన లైను ఉన్న పలాసకు కలుపుతారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే రవాణాతోపాటు సరకు రవాణా ఎంతో సులువుగా మారుతుంది. వాస్తవానికి ఈ ప్రాంతాల నుంచి ఒడిసా వెళ్లాలంటే బస్సుల ఒక్కటే ఆధారం. ఛార్జీలు అధికంగా ఉంటాయి. రైలుమార్గం అందుబాటులోకి వస్తే రవాణా ఖర్చు తగ్గుతుంది.

అంతర్రాష్ట్ర లావాదేవీలు జరుగుతాయి
రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర వ్యాపార లావాదేవీలు ముమ్మరంగా సాగే వీలు కలుగుతుంది. కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అందుకే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తి చూపించారు. గిరిజనులు అతి తక్కువ ఖర్చుతో రైలు ప్రయాణం చేసే వీలు ఈ మార్గంద్వారా కలుగుతుంది. ఈ మార్గం కావాలంటూ 20 సంవత్సరాల ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. అయినప్పటికీ ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రతిపాదనలకు కేంద్రం నుంచి సానుకూల అవకాశం రానుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మార్గంద్వారా గిరిజన ప్రాంతాల్లో పండుతున్న పంటలు, కాయగూరలు, పండ్లు, కాఫీ లాంటివన్నీ బహిరంగ మార్కెట్ లోకి రావడానికి అతి తక్కువ ఖర్చుతో రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లువుతుందని స్థానికులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications