పోలవరం నిధులపై కేంద్రం క్లారిటీ: విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి
న్యూఢిల్లీ: పోలవరం జాతీయ ప్రాజెక్టులో ఇరిగేషన్ విభాగానికి మాత్రమే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు మరోసారి స్పష్టం చేశారు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ సవరించిన అంచనా వ్యయంలో ఇరిగేషన్ పనుల కోసం అయ్యే ఖర్చును మాత్రమే తాము భరిస్తామని ఆయన తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తుది సిఫారసుల తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఇస్లాంను త్యజించి..హిందూ మతాన్ని స్వీకరించిన వక్ఫ్ బోర్డు మాజీ ఛైర్మన్ వసం రిజ్వీ
ఈ మధ్యాహ్నం రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దీనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని సాయి రెడ్డి చెప్పారు. ఇప్పటిదాకా ఎంత మొత్తంలో నిధులను వ్యయం చేశారో వివరించాలని అన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటిదాకా ఏపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చుకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి 2017-18 మధ్యకాలంలో రెండవసారి సవరించిన అంచనా వ్యయం 55,548 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూరకంగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనలను తాము పరిశీలించామని చెప్పారు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ సవరించిన అంచనా వ్యయంలో ఇరిగేషన్ విభాగానికి అయ్యే ఖర్చు మొత్తం 35,950 కోట్ల రూపాయలుగా కుదించామని అన్నారు.
ఇరిగేషన్ పనులకు మాత్రమే ఆమోదం తెలుపుతూ గత ఏడాది మార్చిలో నివేదికను సమర్పించిందని చెప్పారు. దీనిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) తుది సిఫార్సుల అనంతరం క్లియరెన్స్ తీసుకుంటామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. నిజానికి- పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది 2014లో అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం. ఇందులో ఇరిగేషన్ విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని నూటికి నూరు శాతం భరిస్తామని ప్రకటించింది.
దీనికి అనుగుణంగా పోలవరం పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుకు సంబంధించిన బిల్లులను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలించి, వాటిని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు విభాగాల అనుమతి పొందిన తరువాత ఆ బిల్లులను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తామని, ఆ తరువాతే వాటిని చెల్లిస్తామని మంత్రి బిశ్వేశ్వర్ తుడు చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి 11,600 కోట్ల రూపాయలను రీఎంబర్స్ చేశామని పేర్కొన్నారు.