రేపు ఏపీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. ఆయన పర్యటన షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొననున్నారు. కేంద్రమంత్రి పర్యటన, బహిరంగ సభ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఏపీలో నితిన్ గడ్కరీ పర్యటన .. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న నితిన్ గడ్కరీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటన వివరాలు చూస్తే ఉదయం 11.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నేరుగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. రాష్ట్రంలో రూ.11,157 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి నితిన్ గడ్కరీ ప్రారంభింస్తారు . రూ. 10,401 కోట్లతో నిర్మించనున్న 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.
బెంజ్ సర్కిల్ వెస్ట్ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్న నితిన్ గడ్కరీ .. బహిరంగ సభ
ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం బెంజ్ సర్కిల్కు చేరుకుని కొత్తగా నిర్మించిన వెస్ట్ ఫ్లైఓవర్ను నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారు. ఆపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని కేంద్ర మంత్రి సందర్శించి రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి గౌరవార్థం ముఖ్యమంత్రి విందును ఏర్పాటు చేయనున్నారు.
బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్న నితిన్ గడ్కరీ
మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర మంత్రి గడ్కరీ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సాయంత్రం 5.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని నాగ్పూర్కు బయలుదేరి వెళ్తారు. ఇప్పటికే నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై నితిన్ గడ్కరీ, సీఎం జగన్ ఫోటోలు మాత్రమే ఉండటంతో, మోడీ ఫోటో కనిపించకపోవడంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ సర్కారు తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన బిజెపి నేతలు ఉద్దేశపూర్వకంగానే మోడీ ఫోటో పెట్ట లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.