విశాఖ-ఢిల్లీ మధ్య ఏపీ ఎక్స్ప్రెస్, బీజేపీ ఎంపీదే చెల్లు
హైదరాబాద్: హైదరాబాద్ - ఢిల్లీ మధ్య నడుస్తున్న ఏపి ఎక్స్ప్రెస్ను తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చివేసి ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం నుండి కొత్త ఢిల్లీకి ఒక కొత్త రైలును త్వరలోనే ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు గురువారం రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బోర్డు అధ్యక్షుడు, పర్యాటకాభివృద్ది శాఖ కార్యదర్శితో సమావేశమై ఏపీకి సంబంధించిన రైల్వే, ఇతర ప్రాజెక్టుల పని తీరు గురించి సమీక్షించారు.
వెంకయ్యతోపాటు విశాఖపట్నం ఎంపీ హరిబాబు, మరికొందరు కోరుతున్న విధంగా ఆంధ్రప్రదేశ్కు ఏర్పాటు చేయనున్న ఏపీ ఎక్స్ప్రెస్ రైలును విశాఖపట్నం నుండి కొత్త ఢిల్లీకి త్వరలోనే ఏర్పాటు చేస్తామని సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. విజయవాడ, విశాఖపట్నం, నరసరావుపేటకు చెందిన తెలుగుదేశం ఎంపీలు ఏపీ ఎక్స్ప్రెస్ను గుంటూరు నుండి ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

అయితే బీజేపీ లోకసభ సభ్యుడు హరిబాబు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఏపీ ఎక్స్ప్రెస్ను విజయవాడ లేదా గుంటూరు నుండి ప్రారంభిస్తే అది బయలుదేరిన కొద్ది సేపటికి తెలంగాణలో ప్రవేశిస్తుందని, కాబట్టి ఈ రైలును విశాఖపట్నం నుండి ప్రారంభించాలని పట్టుబడుతున్నారు. వెంకయ్య కూడా ఈ ప్రతిపాదనను సమర్థించారు. దీంతో రైల్వే మంత్రి సురేష్ ప్రభు కొత్త ఏపీ ఎక్స్ప్రెస్ను విశాఖపట్నం నుండి ప్రారంభించాలని నిర్ణయించారు.
ప్రస్తుతం నడుస్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ రైలుకు తెలంగాణ ఎక్స్ప్రెస్గా నామకరణం చేసి ఏపీకి కొత్త ఏపీ ఎక్స్ప్రెస్ను ఏర్పాటు చేయటంలో జాప్యం జరగటం పట్ల వెంకయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.
దీనికి సురేష్ ప్రభు స్పందిస్తూ అతి త్వరలోనే ఏపీ ఎక్స్ప్రెస్కు తెలంగాణ ఎక్స్ప్రెస్గా నామకరణం చేసి ఆంధ్రప్రదేశ్ ఏపీ ఎక్స్ప్రెస్ను విశాఖపట్నం నుండి ప్రారంభిస్తామని చెప్పారు. కొత్త ఏపీ ఎక్స్ప్రెస్ను కలిపేందుకు వీలుగా తిరుపతి - విశాఖపట్నం మధ్య నడుస్తున్న రైళ్ల వేళలను సవరిస్తామన్నారు. విశాఖపట్నంలో కొత్త రైల్వే జోన్ పైన చర్చ జరిగింది.












Click it and Unblock the Notifications