ఎపి రాజధానిపై షాక్: సింగపూర్ ప్రతినిధులతో బాబు
న్యూఢిల్లీ/ గుంటూరు: సింగపూర్ ప్రతినిధుల బృందంతో అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమైన నేపథ్యంలోనే సోమవారం ఇటు గుంటూరు రాజధాని నిర్మాణానికి భూసేకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఐక్య వేదిక సమావేశమైంది. రాజధాని నిర్మాణం, భూసేకరణ విధానాలపై ఐక్య వేదిక చర్చించింది. సింగపూర్ కార్పోర్టే కంపెనీలకు చంద్రబాబు రైతు భూములు తాకట్టు పెడుతున్నారని ఐక్య వేదిక విరుచుకపడింది.
పదమూడు జిల్లాలో రాజధానికి లక్ష ఎకరాలు ఎందుకని ప్రశ్నించింది. పార్లమెంటులో చర్చించకుండా భూసేకరణకు ఆర్డినెన్స్ తేవడం వెనక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించింది. తుపాకి, పోలీసుల అండతో రాజధాని నిర్మాణం చేయాలనుకుంటే ప్రజాస్వామ్యంలో సాగదని హెచ్చరించింది. రాజధానికి తుళ్లూరు భూములు తీసుకుంటే కోటి రూపాయల విలువ చేసే పంట నష్టపోతుందని చెప్పింది. రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు వ్యక్తిగత వనరుగా భావిస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజధానికి భూసేకరణ తీరు దుర్మార్గంగా ఉందని అభిప్రాయపడింది.
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సింగపూర్ ప్రతినిధుల బృందం సోమవారం సమావేశమైంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు, రాజధాని నిర్మాణంపై చర్చలు జరిగినట్లు తెలియవచ్చింది. సోమవారం ఉదయం 9-30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చర్చలు జరిగాయి.
నూతన రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు సింగపూర్ ప్రతినిధులు రూపొందించిన బ్లూ ప్రింట్... దానికి సంబంధించిన అంశాలను సీఎం చంద్రబాబుకు, ప్రభుత్వ ప్రతినిధులకు వివరించారు. జూన్ లోగా మాస్టర్ ప్లాన్ సిద్దం చేయడానికి వారు హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణం కోసం నూతన టెక్నాలజీని ప్లాన్ చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఏపీ-సింగపూర్ ప్రభుత్వాల ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే అంశాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలియవచ్చింది.
అలాగే ఈనెల 21 నుంచి 24 వరకు స్విట్జర్లాండ్ రాజధాని దావోస్లో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అక్కడ అంతర్జాతీ పెట్టుబడిదారుల సమావేశం జరగనుంది. ఈ భేటీకి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం అందింది. అందులో భాగంగానే ఈ నెల 20న బాబు దావోస్కు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు ఆ సదస్సుకు హాజరవుతున్నారు.