వైసీపీ సర్కారుకు భారీ షాక్- స్ధానిక ఎన్నికలు రద్దు చేయమని నిమ్మగడ్డకు విపక్షాల వినతి...
ఏపీలో ఎట్టి పరిస్ధితుల్లోనూ స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనీయకుండా అడ్డుపడుతున్న అధికార వైసీపీ ప్రభుత్వానికి ఇవాళ విపక్షాలు షాకిచ్చాయి. ఎన్నికలను తక్షణం నిర్వహించాలని కొన్ని పార్టీలు కోరగా.. మరికొన్ని పార్టీలు గతంలో జరిగిన ఎన్నికలు, ఏకగ్రీవాలను రద్దు చేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డను కోరాయి. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎవరూ ఎన్నికలు వాయిదా వేయాలని మాత్రం కోరకపోవడం విశేషం.

రాజకీయపార్టీలతో నిమ్మగడ్డ భేటీ...
ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతున్నందున ఈ ఏడాద మార్చిలో వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ ప్రక్రియపై ముందుకెళ్లాలని భావిస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశానికి అధికార వైసీపీ మినహా అన్ని పార్టీలు హాజరయ్యాయి. స్ధానిక ఎన్నికల నిర్వహణ విషయంలో తమ అభిప్రాయాలను ఎస్ఈసీకి స్పష్టం చేశాయి. ఇందులో కొంత మేర భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా మెజారిటీ పార్టీలు ఒకే విషయాన్ని ఎస్ఈసీకి స్పష్టం చేశాయి. వీటి ఆధారంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ స్ధానిక పోరుపై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.

వైసీపీకి షాకిచ్చిన విపక్షాలు...
రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన విపక్ష పార్టీలన్నీ ఒక విషయంలో మాత్రం అధికార వైసీపీకి షాకిచ్చాయి. అసలు ఎన్నికల నోటిఫికేషన్నే రద్దు చేయాలని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, బీఎస్పీ, జనతాదళ్, ముస్లిం లీగ్ కోరాయి. గతంలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, ఏకగ్రీవాలు చేసేందుకు జరిగిన ప్రయత్నాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విపక్ష పార్టీలు.. ఏకగ్రీవాలను మాత్రం రద్దు చేసి తీరాలని పట్టుబట్టాయి. వైసీపీ అధికార బలంతో ఈ ఏకగ్రీవాలు చేయించిందని, వీటిని రద్దు చేసి తిరిగి అక్కడ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు టీడీపీ, సీపీఐ, బీజేపీతో పాటు మిగతా విపక్షాలు కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డను కోరారు.

వెంటనే ఎన్నికలు పెట్టాలన్న టీడీపీ...
రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సిద్దంగా ఉన్నామని ప్రధాన విపక్షం టీడీపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్కు స్పష్టం చేసింది. ఇవాళ నిమ్మగడ్డతో సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. స్ధానిక ఎన్నికల సందర్భంగా వైసీపీ పలు అక్రమాలకు పాల్పడిందని ఆయన దృష్టికి తెచ్చారు. ప్రత్యర్ధులను బెదిరించడం, దాడులకు పాల్పడటం ద్వారా వైసీపీ పలు స్ధానాలను ఏకగ్రీవంగా మార్చుకుందని ఆరోపించారు. గతంలో వైసీపీ ఏకగ్రీవాలు చేసుకున్న స్ధానాల్లో వాటిని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని అచ్చెన్నాయుడు కోరారు. కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీకి సూచించారు.

ఎస్ఈసీ నిర్ణయమే తమ నిర్ణయమన్న జనసేన, సమాజ్వాదీ..
రాష్ట్రంలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకున్నా సమర్ధిస్తామని జనసేనతో పాటు సమాజ్వాదీ పార్టీ కూడా స్పష్టం చేశాయి. ఈ సమావేశానికి రాలేకపోయిన జనసేన పార్టీ.. తమ అభిప్రాయాన్ని ఈ మెయిల్ ద్వారా ఎస్ఈసీకి పంపింది. సమాజ్వాదీ పార్టీ ప్రతినిధి మాత్రం హాజరై ఈసీ నిర్ణయమే తమ నిర్ణయమని స్పష్టం చేశారు. మరోవైపు సీపీఎం మాత్ర కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాకే ఓ నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు తెలిపింది. అయితే ఏకగ్రీవాలపై వచ్చిన ఫిర్యాదులను మాత్రం పరిశీలించాలని కోరింది.
Recommended Video

వైసీపీ ప్రెస్నోట్ చూసి ఆశ్చర్యపోయాం : నిమ్మగడ్డ
స్ధానిక ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాల కోసం నిర్వహించిన సమావేశంలో మొత్తం 11 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పాల్గొన్నాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. ప్రభుత్వ అభిప్రాయం కోసం త్వరలో సీఎస్తో సమావేశం అవుతామన్నారు. ఈ భేటీకి హాజరు కావడం లేదంటూ వైసీపీ విడుదల చేసిన ప్రెస్నోట్తో ఎన్నికల కమిషన్ ఆశ్చర్యపోయిందని నిమ్మగడ్డ తెలిపారు. కోవిడ్ పరిస్ధితిపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిన్న కూడా గంటపాటు సమావేశం అయ్యామని, సంప్రదింపుల ప్రక్రియ గొప్ప అంశంగా కమిషన్ భావిస్తోందని నిమ్మగడ్డ తెలిపారు. అన్ని విషయాల్లోనూ సీఈసీ ఉత్తమ పద్ధతులను ఎస్ఈసీ అనుసరిస్తుందన్నారు. ఈ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను కమిషన్ గౌరవిస్తోందని నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications