మోదీ గారు... ఏపీకి అత్యవసరంగా 25లక్షల వ్యాక్సిన్ డోసులు పంపించండి... ప్రధానికి సీఎం జగన్ లేఖ...
దేశవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 14 వరకూ 'టీకా ఉత్సవ్' నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో.... ఏపీకి అత్యవసరంగా 25లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అవసరం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఏప్రిల్ 11 కన్నా ముందు రాష్ట్రానికి ఆ డోసులను పంపిస్తే టీకా ఉత్సవ్ను ఘనంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 2లక్షల వ్యాక్సిన్ డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని... ఇవాళ మరో 2లక్షల డోసులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు.
టీకా ఉత్సవ్ కోసం ఏపీకి 25లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసేలా సంబంధిత ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలని ప్రధానికి సీఎం జగన్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ప్రధానికి సీఎం వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టెస్ట్,ట్రాక్,ట్రేస్ మార్గదర్శకాలను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలుచేస్తున్నామన్నారు. టీకా ఉత్సవ్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమని... దీన్నో అవకాశంగా భావించి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంటున్నామని తెలిపారు.
ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పరిధిలోని ప్రతీ గ్రామంలో ప్రతీ వార్డులో టీకా ఉత్సవ్ చేపడుతామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని... వారి ద్వారా అర్హులైన అందరికీ వ్యాక్సినేషన్ పంపిణీ చేస్తామని చెప్పారు. టీకా ఉత్సవ్ జరిగే నాలుగు రోజుల్లో మొత్తం 4580 గ్రామాలు,1036 అర్బన్ వార్డుల్లో వ్యాక్సినేషన్ చేపడుతామని చెప్పారు. పట్టణాల్లో రోజుకు 4లక్షలు చొప్పున,గ్రామాల్లో రోజుకు 2లక్షలు చొప్పున నాలుగు వారాల్లో మొత్తం 24లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇస్తామన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు.
కాగా,దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఉన్న సమయంలో ప్రధాని మోదీ టీకా ఉత్సవ్ నిర్వహణకు పిలుపునివ్వడమేంటని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో విదేశాలకు కరోనా పంపిణీ సమంజసం కాదని... కేంద్రం ఎలాంటి భేషజాలు చూపకుండా అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేయాలని కోరారు.
ఇటీవల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దేశవ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. 45 ఏళ్లు నిండిన అర్హులలో వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.