ఒకసారి మీరు కూడా ఆలోచించండి జగన్.. !!
గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకోవద్దంటూ ముఖ్యమంత్రి జగన్ పై ఉత్తరాంధ్రకు చెందిన నేతలు ఒత్తిడి తెస్తున్నారు. అధికారం ఎటువైపు ఉంటే అతను ఆవైపు ఉంటాడని, ఈరోజు పార్టీలో ఉన్న వ్యక్తి రేపు ఉంటాడనే నమ్మకం లేదని, అతని కోసం, అతనితోపాటు వచ్చే నాయకుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి త్యాగాలుచేయాల్సిన అవసరం లేదని అధినేతకు తెగేసి చెబుతున్నారు.

ఇప్పటికే చర్చలు జరిపిన గంటా..
ఇప్పటికే వైసీపీ పెద్దలతో చర్చలు జరిపిన గంటా శ్రీనివాసరావు డిసెంబరు 1న తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికారం కోసం వెంపర్లాడే గంటాను పార్టీలో చేర్చుకుంటే పెద్ద తప్పు చేసినట్లవుతుందని, కేవలం అధికారంలో ఉండే పార్టీలోనే ఆయన ఉంటాడని, రేపు మన పార్టీలో ఉంటాడనే నమ్మకం లేదని, అటువంటి వ్యక్తులను చేర్చుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు.

మూడున్నరేళ్లుగా టీడీపీతో అంటీ ముట్టనట్లుగా..
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో 2019 ఎన్నికల తర్వాత పార్టీతో అంటీముట్టనట్లగా గంటా వ్యవహరించారు. పార్టీ నిర్వహించిన మహానాడు, మినీ మహానాడు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. దాదాపు మూడున్నర సంవత్సరాల నుంచి పార్టీకి దూరంగా ఉండి ఇప్పుడు వైసీపీలోకి వస్తున్నట్లు వార్తలు రావడంతో విశాఖపట్నానికి చెందిన నేతలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెస్తున్నారు.

విశాఖలో పార్టీ బలహీనంగా ఉండటంతో..
విశాఖపట్నంలో పార్టీ బలహీనంగా ఉండటంతో గంటాలాంటి నేతలను తీసుకోవాలని అధిష్టానం భావిస్తోంది. గంటాకు ప్రత్యర్థిగా ఉన్న అవంతి శ్రీనివాస్ భీమిలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనే వైసీపీలో చేరాలనుకున్న గంటా వ్యూహాన్ని పసిగట్టిన అవంతి శ్రీనివాస్ వెంటనే తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరి భీమిలీ టికెట్ దక్కించుకొని మొదటి విడతలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. గంటా శ్రీనివాసరావు దృష్టి భీమిలీపై ఉంది. ప్రస్తుతం విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా పార్టీలోకి వస్తే భీమిలీ టికెట్ కేటాయిస్తారా? అవంతి శ్రీనివాస్ ను ఎక్కడ సర్దుబాటు చేస్తారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.












Click it and Unblock the Notifications