టోకెన్లు లేని వాళ్లు శ్రీవారి దర్శనాన్ని ఆశించవద్దు..: టీటీడీ విజ్ఞప్తి
Vaikunta Ekadasi 2025: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 54,180 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 17,689 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.12 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 16 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

మరోవంక- వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతోంది తిరుమల. ఈ నెల 10 నుండి 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ 10 రోజుల పాటు ఏడు లక్షలమంది భక్తులు వచ్చే అవకాశం ఉండటం వల్ల దానికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టింది.
వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు మార్గదర్శకాలను జారీ చేశారు. భక్తులు ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లను తీసుకోవడం ద్వారా తిరుమలలో క్యూ లైన్లల్లో ఎక్కువ సమయం వేచి ఉండకుండా స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
దర్శనం టోకెన్లు లేదా టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే క్యూ లైన్లలోకి అనుమతి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. టోకెన్లు/టికెట్లు లేని భక్తులకు క్యూలైన్లో ప్రవేశం ఉండదు. అవి లేని వాళ్లు తిరుమలకు రావొచ్చు గానీ శ్రీవారి దర్శనం మాత్రం లభించదు. టోకెన్లు/టికెట్లు ఉంటేనే స్వామివారిని దర్శించుకోవచ్చు. 19వ తేదీ వరకు శ్రీవారి మెట్లు కౌంటర్లను మూసివేస్తారు.
తిరుపతి, తిరుమలల్లోని కౌంటర్లల్లో గురువారం తెల్లవారు జామున 5 గంటల నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తారు. ఈ టోకెన్లు 10, 11, 12 తేదీలకు మాత్రమే సంబంధించినవి. ఈ మూడు రోజుల కోటా పూర్తయన తరువాత మిగిలిన రోజులకు అంటే 13 నుంచి 19వ తేదీ వరకు దర్శనాలకు సంబంధించి టోకెన్లు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణువాసం, భూదేవి కాంప్లెక్స్లల్లో ఏరోజుకారోజు ఇస్తారు.
9వ తేదీకి సంబంధించి తిరుపతిలోని కౌంటర్లల్లో ఎస్ఎస్డీ టోకెన్ల జారీని నిలిపివేస్తారు. టికెట్లు లభిస్తాయా? లేదా? అనే సమాచారాన్ని ఎస్వీబీసీ, టీటీడీ వెబ్సైట్, ఇతర అధికారిక ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న తరువాతే భక్తులు తిరుమలకు రావాల్సి ఉంటుంది.
తిరుమలలో పరిమిత సంఖ్యలో వసతి గదులు అందుబాటులో ఉన్నందున భక్తులు తాము పొందిన టోకెన్లల్లో పేర్కొన్న తేదీ, సమయం ప్రకారం మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాల్సి ఉంటుంది. ఎక్కువమంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ 10 రోజుల పాటు ఎలాంటి సిఫారసు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరించరు.












Click it and Unblock the Notifications