సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర పోస్ట్ లపై వల్లభనేని వంశీ ఫిర్యాదు..
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసభ్య ప్రచారంపై వల్లభనేని వంశీ విజయవాడ పోలీస్ కమీషనర్ తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ పేజీల నుండి వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తూ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు పెడుతున్నారని ఆరోపించిన వంశీ ఫేస్ బుక్, ట్విట్టర్ లను వేదికగా చేసుకొని తనపై అసత్య ప్రచారానికి దిగారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలను కూడా ఆయన విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కు అందజేసినట్లు గా తెలుస్తుంది.
ఈ సమయంలో తనను సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్న టిడిపి నేతలపై వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేరుగా తనను ఢీకొట్టే శక్తి లేనివారు సోషల్ మీడియా వేదిక చేసుకొని ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారని వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంతే కాదు పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన చిల్లర రాజకీయాలు చేయడం తగదని టిడిపి నేతలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు దగుల్బాజీలు, సన్నాసులు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు వల్లభనేని వంశీ.

టీడీపీకి రాజీనామా చేసిన నాటి నుండి నేటి వరకు సైలెంట్ గా ఉన్న వంశీ నిన్నటి నుండి వైలెంట్ గా మారారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం వల్లే వల్లభనేని వంశీ ఈ విధంగా ఘాటుగా స్పందిస్తున్నారని తెలుస్తుంది. ఇక నిన్నటికి నిన్న చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించిన వంశీ జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకుని వదిలేసారని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కి దూరంగా ఉండటానికి కారణం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఇక నారా లోకేష్ చెప్పిన మాట మేం వినాలా అంటూ నిలదీశారు.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి కొంతైనా సమయం ఇవ్వకుండా దీక్షల పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఇక ఇదే సమయంలో యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ పై కూడా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు వంశీ. సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న కారణంగానే తాను ఈ విధంగా స్పందిస్తున్నానని పేర్కొన్న వల్లభనేని వంశీ టిడిపి అనుబంధ సోషల్ మీడియా పై ఫిర్యాదు చేశారు. ఇక వంశీ తీరుతో చంద్రబాబు నాయుడు వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications