అవయవదానం: వంశీ.... నీకు మరణం లేదు, బెజవాడ టూ హైదరాబాద్
విజయవాడ: బ్రెయిన్ డెడ్ అయిన వంశీ అనే 28 ఏళ్ల యువకుడి అవయవాలను విజయవాడ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. వంశీ అవయవాలను దానం చేయడానికి అతని తల్లిదండ్రులు అంగీకరించారు. విజయవాడలోని ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వంశీ బ్రెయిన్ డెడ్ అయ్యాడు.
తల్లిదండ్రుల అంగీకారంతో వంశీ శరీరానికి చికిత్స చేసి, అవయవాలను తొలగించి హైదరాబాదుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వంశీ అవయవాలను బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయానికి తరలించారు.
వంశీ గుండెను హైదరాబాదులోని అపోలో ఆస్పత్రికి, లివర్ను యశోదా ఆస్పత్రికి తరలిస్తున్నారు. వంశీ చనిపోతూ నలుగురికి ప్రాణదానం చేస్తున్నాడు. వంశీ భౌతిక కాయాన్ని స్వస్థలం జగ్గయ్యపేటకు తరలిస్తున్నారు. ఈ స్థితిలో జగ్గయ్యపేట నుంచి పలువురు విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి వచ్చి వంశీ తల్లిదండ్రులకు బాసటగా నిలిచారు.
వంశీ అవయవాలను ఆఘమేఘాల మీద ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి హైదరాబాదు తరలిస్తున్నారు.
జగ్గయ్యపేటకు చెందిన వంశీకృష్ణ ఓ ప్రైవేటు కళాశాలలో కంప్యూటర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన తలనొప్పి, జ్వరంతో ఇటీవల అస్వస్థతకు లోనయ్యాడుఅనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స చేయించడంతో తాత్కాలికంగా స్వస్థత చేకూరింది అయితేమూడురోజుల క్రితం తిరిగి అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
దీంతో కుటుంబసభ్యులు అతడిని విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. వంశీకృష్ణ వైద్యానికి స్పందించని అచేతన స్థితికి చేరుకున్నట్లు వైద్యులు నిర్ధారించి కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో వంశీకృష్ణ అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులంతా అంగీకరించారు.