తిరుమలలో ఒక్కరోజే 98,000 మందికి దర్శనం: 30 గంటల సమయం
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సాధారణ రోజుల కంటే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. వారం రోజులుగా అసాధారణంగా భక్తులు శ్రీవారి చెంతకు చేరుకుంటోన్నారు. దేవదేవుడిని దర్శించుకుంటోన్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటోన్నారు. వేలాది వస్తోండటంతో తిరుమల కిటకిటలాడుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదనపు సౌకర్యాలను కల్పిస్తోన్నారు.
శనివారం నాడు రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏకంగా 97,561 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ సంఖ్యలో భక్తులు ఎప్పుడూ స్వామివారిని దర్శించుకోలేదు. అలాగే 57,780 మంది తలనీలాలను సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లూ నిండిపోయాయి. బాటగంగమ్మ ఆలయం వరకూ క్యూలైన్ ఏర్పడింది. శ్రీనివాసుడి దర్శనానికి 30 గంటల సమయం పట్టింది.

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు దర్శన క్యూలైన్లు, ట్రాఫిక్, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ పంపిణీ, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు.
చిన్నపిల్లలు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చారు. అత్యధిక సంఖ్యలో వాహనాలు తిరుమలకు వచ్చినప్పటికీ, ట్రాఫిక్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వెంకయ్య చౌదరి తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో 320కు పైగా ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులో ఉండగా.. అదనంగా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మరో 100కు పైగా ట్రిప్పులు నడిపిస్తోంది టీటీడీ.
రోజుకు సుమారు నాలుగు లక్షల మందికి సరిపడా అన్నప్రసాదాలను సిద్ధం చేశారు టీటీడీ అధికారులు. రోజుకు దాదాపు 45,000 లీటర్ల మజ్జిగ, 50,000 లీటర్ల పాలను భక్తులకు అందిస్తున్నారు. అన్ని విభాగాలు షిఫ్టుల వారీగా 24 గంటలపాటు పనిచేస్తోన్నాయి. మొబైల్ టీమ్స్, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేశారు. అదనంగా శ్రీవారి సేవకులను నియమించారు.
భక్తులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని టీటీడీ అధికారులు సూచించారు. సమాచారం అందిన వెంటనే స్పందించే విధంగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి, శ్రీవారి మెట్లు తదితర ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు.












Click it and Unblock the Notifications