చిత్తూరులో దళిత మహిళపై ఖాకీల క్రౌర్యం .. జాతీయ మహిళా కమిషన్కు వంగలపూడి అనిత లేఖ
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, చిత్తూరు జిల్లాలో దళిత మహిళను పోలీసులు వేధింపులకు గురి చేశారని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
క్యాసినోలో జగన్ వాటా ఎంత? వారిని అరెస్ట్ చెయ్యకుంటే జగన్ ఇల్లు ముట్టడే: వంగలపూడి అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్రహింసలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, తప్పుడు కేసులు, కస్టోడియల్ వేధింపులు, అర్ధరాత్రి అరెస్టులు విపరీతంగా పెరిగిపోయాయని అనిత ఆరోపించారు. ఏపీలో అరాచకాలు తారా స్థాయికి చేరాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్రహింసలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని విమర్శించారు. ఇక తాజాగా చిత్తూరు జిల్లాలో దళిత మహిళను చిత్రహింసలకు గురిచేశారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయని దొంగతనాన్ని దళిత మహిళపై వేసి రెండు రోజులపాటు స్టేషన్ కు పిలిపించి చిత్రహింసలకు గురి చేశారని వంగలపూడి అనిత పేర్కొన్నారు.
దళిత మహిళకు దొంగతనం అంటగట్టి పోలీసుల వేధింపులు
వైయస్ జగన్ పాలనలో దళితులు, మహిళల ప్రాణాలకు రక్షణ లేదని మరోసారి రుజువైందని ఈ ఘటన తెలియజేస్తుందని వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు జైలు సూపరిండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో రెండు లక్షల రూపాయలు పోయాయని, పనిమనిషి అయిన దళితమహిళ ఉమామహేశ్వరికి చేయని దొంగతనాన్ని అంటగట్టి అక్రమంగా నిర్బంధించడంతోపాటు ఆమెను వేధింపులకు గురి చేశారని పేర్కొన్నారు అనిత. స్టేషన్లోనే మగపోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి దొంగతనం ఒప్పుకోవాలని హింసించారని వంగలపూడి అనిత పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొంతమంది ఖాకీల రాక్షసత్వానికి ఈ ఘటన పరాకాష్ట
కొంతమంది ఖాకీల రాక్షసత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని ఆమె వెల్లడించారు. వేణుగోపాల్రెడ్డి ఇంటి మనుషులే దొంగలని తేలాక కూడా పోలీసులు తమ క్రూరత్వాన్ని చూపారని, అప్పుడు కూడా ఉమా మహేశ్వరిని వేధించారని వంగలపూడి అనిత మండిపడ్డారు. దళిత మహిళ ఉమామహేశ్వరిపై దొంగతనం మోపిన జైలు సూపరింటెండ్ వేణుగోపాల్రెడ్డిని, హింసించిన పోలీసుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని ఈ ఘటనపై ఎస్సీ,ఎస్టీ-మహిళ కమిషన్లు సుమోటోగా కేసు నమోదు చేసి దళిత మహిళకి న్యాయం చేయాలని అనిత పేర్కొన్నారు .
Recommended Video
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమీషన్ కు లేఖ
పోలీసులు మానవ హక్కుల సూత్రాలను పూర్తిగా విస్మరించారని వంగలపూడి అనిత అభిప్రాయం వ్యక్తం చేశారు . ఇలాంటి దారుణ ఘటనలు ఏపీలో నిత్య కృత్యంగా మారుతున్నాయని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టులు, కస్టోడియల్ చిత్రహింసలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను కూడా పూర్తిగా విస్మరించారని వంగలపూడి అనిత ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్ కు విజ్ఞప్తి చేశారు. గతంలోనూ తాడేపల్లిలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన విషయంలో కూడా వంగలపూడి అనిత జాతీయ మహిళా కమీషన్ కు లేఖ రాసి ఏపీలో జరుగుతున్న దారుణ ఘటనలపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.