దేనికైనా సిద్ధం! దమ్ముంటే రా..: చంద్రబాబుకు వంగవీటి రాధ సవాల్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన తండ్రి వంగవీటి మోహన రంగా, దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డిలతో కట్టించిన బ్యానర్లను కూడా చంద్రబాబు తీయించారని మండిపడ్డారు.
విజయవాడలో మంగళవారం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వంగవీటి రాధా మాట్లాడుతూ.. నువ్వొక నాయకుడివి, నువ్వొక ముఖ్యమంత్రివా.. సిగ్గు, శరం ఉన్నాయా? అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
తాము బతికినంత కాలం, రాజకీయాల్లో ఉన్నంత కాలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎంత బెదిరించినా లొంగేది లేదన్నారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి ఉండటం వల్ల సామాన్య ప్రజలకు ట్రాఫిక్ సమస్య తిప్పలు తప్ప.. వేరే ప్రయోజనం ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు.
డివైడర్లు పగలగొడతారు, మళ్లీ కట్టిస్తారని.. ఏ పని ఎందుకు చేస్తున్నారో తెలియదని అన్నారు. తన తండ్రిని చంపించినవాళ్లతో బ్యానర్లు కట్టించుకుంటున్నారని విమర్శించారు. నాలుగు రోజులు ఆగితే విజయవాడలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతూ ఉంటుందని అన్నారు. తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని.. దమ్ముంటే రావాలని సవాలు చేశారు.
సాక్షి టీవీ ఛానల్ ఆపారు గానీ సోషల్ మీడియాను ఆపగలరా? అని ప్రశ్నించారు. ఎదురుతిరిగితే మీ పరిస్థితి ఏంటని వంగవీటి రాధాకృష్ణ నిలదీశారు. తమది నిజంగా ప్రజల కోసం పోరాడే పార్టీ కాబట్టి తమ పోరాటానికి ప్రజల మద్దతు ఉంటోందని వంగవీటి రాధా చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఎవరికీ ఇబ్బంది అన్నది లేకుండా చూస్తామని రాధ అన్నారు. ఒకవైపు కాపుల సమస్యలపై ముద్రగడ పద్మనాభం నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే.. పనికిమాలిన వాళ్లతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారని దుయ్యబట్టారు.