తేలిగ్గా తీసుకోం, వదలిపెట్టం: రంగా విగ్రహ ధ్వంసంపై వంగవీటి రాధా హెచ్చరిక
విజయవాడ: మచిలీపట్నంలో తన తండ్రి వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని తేలికగా వదిలిపెట్టబోమని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు. ఆదివారం మధ్యాహ్నం విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
రాధా రాకతో నిజాంపేట ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన అనంతరం రాధా మాట్లాడారు.
కార్యకర్తలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. విగ్రహం ధ్వంసం జరుగుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణం నిందితులను పట్టుకోకుంటే తన స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు మచిలీపట్నంలో కాపు సంఘం నేతల నిరసనలు కొనసాగుతున్నాయి.
కాగా, రంగా విగ్రహ ధ్వంసం నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఆదివారం నాడు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మచిలీపట్నంలోని స్వర్గీయ వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి ధ్వంసం చేశారు.
ధ్వంసం చేసిన విగ్రహం వద్ద కాపు నేతలు బైఠాయించారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ వారు డిమాండ్ చేస్తున్నారు. అక్కడే కాకుండా పలు ప్రాంతాల్లో కాపు సంఘాల నేతలు ధర్నాలకు దిగారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పరిశీలించిన పోలీసులు, నిందితులను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్, నూజివీడు తదితర ప్రాంతాల్లో కాపు యువత, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్లను దిగ్బంధించారు.