బెజవాడలో వంగవీటి రాధా రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకమేనా ?
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయారైంది బెజవాడ కు చెందిన కీలక నేత వంగవీటి రాధా పరిస్థితి. వంగవీటి రంగా తనయుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని చూస్తున్న రాధా పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సరైన నిర్ణయం తీసుకోలేక, తీసుకునే ప్రతి నిర్ణయం కలిసిరాక, తన వ్యవహారశైలితో ఉన్నదానిని కూల్చుకుంటూ కొత్త వాటి కోసం ఆయాస పడుతున్న రాధా రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.

2004 తర్వాత రాధా తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పే .. వరుస ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన వంగవీటి రాధా
తన తండ్రి - కాపు నాయకుడు వంగవీటి రంగా చరిష్మాను అడ్డుపెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన రాధా కాంగ్రెస్ హయాంలో 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయంగా వేసిన ప్రతి అడుగు తప్పటడుగు కావడం ఆయన రాజకీయ మనుగడకే తిప్పలు తెచ్చిపెడుతోంది.
2004లో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించి ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి రాధ ఆ తర్వాత ఎన్నికల సమయానికి పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకువచ్చిన రాధా.. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తన సామాజిక వర్గం తనను కాపాడుతుందని గట్టిగా నమ్మి చిరంజీవి చరిష్మా తనను గెలిపిస్తుందని భావించి వైఎస్ ఎంత చెప్పినా వినకుండా పార్టీ నుంచి బయటకు వచ్చారు. కానీ 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు రాధా మౌనంగా చూస్తూ ఉండడం తప్ప మరేం చేయలేకపోయారు. ఇక ఆ తర్వాత చాలా ఏళ్లకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఎన్నికల ముందు వైసీపీ నుండి బయటకు వచ్చి తప్పు చేసిన రాధా
వైసీపీ టికెట్ పై 2014లో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఇక ఆతర్వాత కూడా అదే పార్టీలో కొనసాగినా కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలవలేకపోయిన రాధా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. రాజకీయంగా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇక తాజా ఎన్నికల సమయానికి విజయవాడ సెంట్రల్ టిక్కెట్ కోసం పట్టుబట్టి, ఎంపీ టికెట్ ఇస్తానన్నా , మరి ఏదైన నియోజకవర్గం కావాలంటే కోరుకోమన్నా వినకుండా మరోసారి తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నారు . నేరుగా వైసీపీ నుంచి వెళ్లి.. తన తండ్రి తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ లోకి జంప్ అయ్యి ఎన్నికల్లో జగన్ ఓటమి కోసం పని చేశారు. మరోసారి టీడీపీ అదికారంలోకి రావడం ఖాయమని , తనకు రాజకీయంగా ఉజ్వల భవితవ్యం ఉంటుందని కలలు కన్నారు రాధా. అయితే రాష్ట్రంలో అధికారం మారిపోయింది. టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.దీంతో మరోమారు దెబ్బ తిన్నారు రాధా.

పవన్ పార్టీలో చేరాలని ప్రయత్నం చేస్తున్న రాధా.. రెండు సార్లు కలిసి సైలెంట్ గా ఉన్న కాపు నేత
2009 నుండి ఇప్పటివరకు రాధా గెలిచింది లేదు. బెజవాడ రాజకీయాల మీద పట్టు సంపాదించింది లేదు. ఇక వరుసగా మూడు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో రాధా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. టిడిపిలో ఉంటే ఇక రాజకీయం చేయడం అనే కష్టమని భావిస్తున్న రాధ ఈమధ్య జనసేనాని పవన్ కళ్యాణ్ ను రెండు పర్యాయాలు కలిశారు. జనసేన తీర్థం పుచ్చుకోవడానికి రాధ సిద్ధమైనట్లుగా ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో త్వరలో రాధా జనసేన తీర్ధం పుచ్చుకోబోతున్నారని ప్రచారం జరిగింది .వంగవీటి రాధా తండ్రి, దివంగత నేత వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా జులై 4 లేదా 5 న జనసేన కండువా కప్పుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి . కానీ జనసేనలో వంగవీటి రాధా ఇంకా చేరలేదు.

స్థిరత్వం లేకుండా పార్టీలు మారటమే రాధా రాజకీయ మనుగడను ప్రశ్నార్ధకం చేసిందా ?
అయితే ఇప్పటివరకు స్థిరత్వం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అంటూ జంప్ అయిన రాధా ఇప్పుడు తీసుకునే నిర్ణయం కూడా సరైనది కాదు అనే భావన కొందరిలో వ్యక్తమవుతోంది. వంగవీటి తనకు సెంట్రల్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి యుద్ధం చేసి బయటకు వచ్చి వైసీపీ ఓటమికి పని చేయడం ఇప్పుడు రాధకు పెద్ద మైనస్. ఇక అదే సమయంలో టీడీపీలో చేరడం మరో పెద్ద మైనస్. ఇప్పుడు ఏపీలో చక్రం తిప్పాలని భావిస్తున్న బీజేపీ లో చేరాలని ఆయనను ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు రాధా జనసేనలో చేరాలా లేక బిజెపిలో చేరాలా అన్నది తేల్చుకోలేక తెగ ఇబ్బంది పడుతున్నారు . ఏదేమైనా 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఫెయిల్యూర్ ను చూస్తున్న వంగవీటి రాధా రాజకీయం ముగిసినట్టేనని బెజవాడ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications