తెలుగురాష్ట్రాల్లో వరలక్ష్మీ వ్రత శోభ .. సామూహిక వరలక్ష్మీ వ్రతాలతో కళకళలాడుతున్న ఆలయాలు
Recommended Video
తెలుగు రాష్ట్రాలలో శ్రావణ మాసం లో నిర్వహించే వరలక్ష్మి వ్రతం పండుగ శోభను సంతరించుకుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. జగన్మాత అయిన అమ్మవారు వరలక్ష్మిగా కొలువుదీరనున్న ఈ వేళ వరాలిచ్చే చల్లని తల్లి అయిన వరలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. నేడు వరలక్ష్మి వ్రతం కావడంతో ఇక ప్రతి ఇల్లు పండుగ శోభతో కళకళలాడుతోంది.

ఆలయాల్లో మహిళల సందడి ... సామూహిక వరలక్ష్మీ వ్రతాలతో ఆధ్యాత్మిక శోభ
శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావటంతో ఇవాళ సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కావలసిన పూజ సామాగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఇక పూల ధరలు, పండ్ల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. నేడు తప్పనిసరిగా వ్రతం నిమిత్తం కొనుగోలు చేస్తారు కాబట్టి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు పూలు, పండ్ల ధరలు అమాంతం పెంచేశారు. తప్పనిసరి కావడంతో కొనక తప్పక మహిళలు కొనుగోలు చేస్తున్నారు.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలందరూ సాంప్రదాయబద్దంగా చక్కగా ముస్తాబై అమ్మవారిని ఈరోజు విశేషంగా పూజిస్తారు. పలు దేవాలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తారు.

అమ్మవారిని దర్శించుకోటానికి దేవాలయాల ముందు బారులు తీరిన మహిళలు
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఎన్నో అమ్మవారి క్షేత్రాలను సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలన్ని భక్తజన కోటితో కిటకిటలాడుతున్నాయి. జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి దేవి కరుణ ఉంటే ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందన్న భావన మొదటి నుండి తెలుగు ప్రజల్లో ఉన్న కారణంగానే విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించి మహాలక్ష్మిని ఆరాధిస్తారు.
రకరకాల నైవేద్యాలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. నేడు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు కావటంతో మహిళలు ముఖ్యంగా అమ్మవారిని దర్శించుకోటానికి దేవాలయాల ముందు బారులు తీరారు.

భక్తులతో పోటెత్తిన ఆలయాలు ... ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు
రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధ క్షేత్రాలలో వరలక్ష్మీ వ్రత సందడి కనిపిస్తుంది. బాసర అమ్మవారి క్షేత్రంలోనూ భక్తజనంతో పోటెత్తింది. అటు ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ ను సైతం భక్తులు విశేషంగా దర్శించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కేం ద్రంలోని చైతన్యపురికాలనీ మహశక్తి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వరలక్ష్మి వ్రతాలు, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహిస్తారు . ఇక అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భద్రకాళి దేవాలయం లోనూ, రాజరాజేశ్వరీ దేవాలయం లోనూ, సంతోషిమాత దేవాలయం లోనూ, హైదరాబాద్ మహాలక్ష్మీ దేవాలయంలోనూ నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించటంతో ప్రముఖ దేవాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. మహిళలకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ప్రతి శుక్రవారం విశేషంగా పూజలు నిర్వహిస్తారు. శ్రావణమాసంలో రెండో శుక్రవారం అయిన వరలక్ష్మీ వ్రతం రోజు మాత్రం చాలా ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు.












Click it and Unblock the Notifications