బీజేపీ వర్సెస్ టీడీపీ!: పురంధేశ్వరిపై వర్ల రామయ్య భగ్గు
హైదరాబాద్: మిత్రపక్షాలైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య మాటల యుద్ధం కనిపిస్తోంది. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి వ్యాఖ్యల పైన టీడీపీ నేత వర్ల రామయ్య బుధవారం ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఏపీలో పాలన సాగుతోందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు.
పురంధేశ్వరికి ఇంకా కాంగ్రెస్ వాసన పోయినట్లుగా కనిపించడం లేదన్నారు. పురంధేశ్వరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆమెకు ఎన్టీఆర్ కుమార్తెగానే గుర్తింపు ఉందన్నారు. కేంద్రమంత్రిగా పని చేసిన పురంధేశ్వరి వ్యాఖ్యలు సరికాదన్నారు.
సింగపూర్, జపాన్ల సహకారంతో కొత్త రాజధాని నిర్మాణం: చంద్రబాబు

రాజధాని నిర్మాణానికి మాస్టర్ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తామని చెప్పిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేరుగా చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి మాస్టర్ప్లాన్ ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందన్నారు. సింగపూర్, జపాన్ ప్రభుత్వాల సహకారంతో కొత్త రాజధాని నిర్మాణం చేపడతామని చంద్రబాబు ప్రకటించారు.
ఎమ్మార్పీ ధరకే మద్యం విక్రయించాలి: మృణాళిని
విజయనగరం జిల్లాలో బెల్టుషాపుల వివాదం ముదిరి పాకానపడింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే మద్యం విక్రయాలు జరగాలన్న మంత్రి మృణాళిని నిర్ణయంపై బెల్టు షాపుల యజమానులు ధ్వజమెత్తారు. బెల్టు షాపులు, బారులు మూసివేసి జిల్లా వ్యాప్తంగా బుధవారం నిరసనలు చేపట్టి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వ్యాపారస్తులకు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత శాఖాధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని మంత్రి మృణాళిని సూచించారు. జిల్లాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరకు మద్యం విక్రయాలు జరిగితే సహించబోమన్నారు.
జిల్లాలో ఉన్న నిబంధనల ప్రకారం, ప్రభుత్వం ఆదేశాల మేరకు బెల్టు షాపులు మూసివేయాలని... రెండవది మద్యం విక్రయాలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలని చెబుతున్నామని, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తానేమి చేయడం లేదన్నారు.












Click it and Unblock the Notifications