రాష్ట్రంలో పరిస్థితులపై ఆ వీడియోను పంపి .. జాతీయ మానవహక్కుల సంఘానికి వర్ల రామయ్య లేఖ
టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సంఘటనల నేపథ్యంలో ఎన్ హెచ్ఆర్సి కి లేఖ రాశారు. చిలమత్తూరు ఎస్సై పై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసిన వర్ల రామయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుడు వేణుగోపాల్ పై ఎస్సై దాడి చేసిన వీడియోను ఎన్ హెచ్ ఆర్ సి కి పంపించి చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఎన్ హెచ్ఆర్సి కి రాసిన లేఖలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని వర్ల రామయ్య పేర్కొన్నారు. పోలీసులు బాధితుల పైన దాడులు, వేధింపులు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్లో బాధితుడు వేణుగోపాల్ పై ఎస్సై దాడి చేసిన ఘటనను ఎన్ హెచ్ ఆర్ సి కి వివరించిన వర్ల రామయ్య కొంతమంది పోలీసుల దుర్మార్గపు చర్యలకు ఇది నిదర్శనం అంటూ పేర్కొన్నారు. చిలమత్తూరు ఎస్ఐ రంగడు పై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా కోరుకున్నారు.
హిందూపురం అసెంబ్లీ లోని సజీవ రాయన పాలెం కు చెందిన బీసీ మహిళ పద్మావతి చాలా కాలంగా వికలాంగుల పింఛన్ పొందుతున్నారు. అయితే ఆమె వైసిపికి అనుకూలంగా లేదని వైసిపి నాయకులు ఆమె పెన్షన్ ను తొలగించారు. తన తల్లి పెన్షన్ తొలగించడాన్ని ప్రశ్నించిన ఆమె కుమారుడు వేణుగోపాల్ పై స్థానిక వైసీపీ నాయకుడు దామోదర్ రెడ్డి దాడి చేసి అతనిపై అక్రమ కేసు బనాయించారు. ఇక ఈ విషయంలో జరిగిన వాస్తవాలను పోలీసులకు చెప్పి, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వేణుగోపాల్ పై చిలమత్తూరు ఎస్ఐ రంగడు అసభ్యంగా దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడ్డాడు అని పేర్కొన్న వర్ల రామయ్య బాధితుడిని బాధించటం అత్యంత నేరమని, దుర్మార్గం అని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ఎస్సై కాలరాస్తున్నారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఇది ఏపీ పోలీస్ మాన్యువల్ కు కూడా పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. నాగరిక ప్రజాస్వామ్య సమాజంలో ఎస్ఐ రంగడు ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కాదని వర్ల రామయ్య తెలిపారు. వేణుగోపాల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన ఎస్సై రంగడుపై విచారణ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య ఎన్ హెచ్ ఆర్ సి కి విజ్ఞప్తి చేశారు. మరి దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.