రాజు గారు మీరు మరీనూ , జగన్ కరోనా మీద దృష్టి పెట్టాలా.. బెయిల్ రద్దు ఆపుకోవాలా ? కింకర్తవ్యం ? :వర్ల సెటైర్లు
వైసిపి అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా వైయస్ జగన్ బెయిల్ రద్దుకు సంబంధించి తీవ్ర చర్చ జరుగుతూ ఉండటం, బీజేపీ పెద్దలు జగన్ జైలుకు వెళ్లడం ఖాయం అంటూ పదే పదే వ్యాఖ్యానించడం వెరసి జగన్ బెయిల్ రద్దు కు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
జగన్ బెయిల్ రద్దు పిటీషన్ విచారణపై వర్ల సెటైర్లు
నరసాపురం ఎంపీ, వైసిపి తిరుగుబాటు నేత రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్ ను సిబిఐ కోర్టు విచారణకు అర్థమైందని భావించి దానిని స్వీకరించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది . ఇక దీనిపై టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు . ఇప్పుడు జగన్ దేనిపై దృష్టి పెడతారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు .
రాజుగారూ... ఇదా సమయం ముఖ్యమంత్రి గారి బెయిల్ రద్దు చేయమని కోరడానికి ?
రాజు గారూ మీరు మరీను.. ఇదా సమయం ముఖ్యమంత్రి గారి బెయిల్ రద్దు చేయమని కోరడానికి ? అంటూ ప్రశ్నించిన వర్ల రామయ్య కోర్టు మీ అభ్యర్థన విచారణార్హమైనదని చెప్పడం ,దీనితో ముఖ్యమంత్రి గారి గొంతులో వెలక్కాయ పడటం జరిగిపోయాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలే ఆయన ఆలోచనలు అంతంత మాత్రమే, ఇప్పుడు తాజా పరిణామాలతో కరోనా మీద దృష్టి పెట్టాలా ? లేక బెయిల్ రద్దు ఆపుకోవాలా ? కింకర్తవ్యం ? అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు.
ఆర్ఆర్ఆర్ కు బదులుగా విష్ణుకుమార్ రాజు అని రాసిన రామయ్య .. పొరబాటని చెప్పిన నెటిజన్
అయితే రఘురామకృష్ణంరాజు కు బదులుగా వర్ల రామయ్య విష్ణుకుమార్ రాజు అని పేర్కొనడంపై ఒక నెటిజన్ స్పందించారు.. వర్ల రామయ్య గారు వీకేఆర్ కాదంటూ ఆర్ఆర్ఆర్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి వర్ల రామయ్య బదులిస్తూ థాంక్యూ సర్ , మీరు చెప్పిందే కరెక్ట్ అంటూ వ్యాఖానించారు . ఇక తాజాగా సీబీఐ కోర్టు జగన్ బెయిల్ రద్దు పిటీషన్ ను విచారిస్తామని చెప్పటంతో వైసీపీ నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది . ఇక వైఎస్ జగన్ సైతం ఇప్పుడు ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది .
కరోనా విషయంలో కూడా వర్ల జగన్ కు సూటి ప్రశ్న
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి సూటిగా ప్రశ్నించిన వర్ల రామయ్య ముఖ్యమంత్రి గారు నిన్నటికి నిన్న రామతీర్థ కోదండరామాలయం నిర్వహణ సరిగా లేదని దేవాలయ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించారు. మరి ఈరోజు ఆక్సిజన్ సరిగా అందక విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులు మరణించారు. ఇప్పుడు మీరు ఎవరిని తొలగిస్తారు? జిల్లా మంత్రి బొత్స నా .. లేక ఆరోగ్య మంత్రి ఆళ్ల నానీనా? అంటూ సూటిగా ప్రశ్నించారు వర్ల రామయ్య.