పవన్ కు వర్మ బిగ్ షాక్ - పిఠాపురంలో వాట్ నెక్స్ట్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ టీడీపీ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొస్తోంది. కూటమి ఒప్పందం మేరకు డిప్యూటీ సీఎం గా పవన్ కు మాత్రమే అవకాశం కల్పించారు. పవన్ కొంత కాలంగా ప్రభుత్వం పైన తెస్తున్న ఒత్తిడి .. చేస్తున్న డిమాండ్స్ తో టీడీపీ ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. కౌంటర్ గా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ సమయంలోనే పిఠాపురంలో పవన్ గెలుపుకు సహకరించిన వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు.
వర్మ తాజా డిమాండ్
లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి పైన టీడీపీ నేతల నుంచి డిమాండ్ పెరుగుతోంది. కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన వేళ ఆయన సమక్షంలోనే పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి ఇదే డిమాండ్ చేసారు. దీనికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు పిఠాపురం నేత వర్మ సైతం లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేశారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభా వాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిన జగన్ బయటకు వస్తే ఇప్పటికీ ఆ పార్టీ కేడర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే విధంగా పవన్ ను సైతం ఆయన అభిమానులు సీఎం అంటూ పిలుస్తారని గుర్తు చేసారు.

చంద్రబాబుదే నిర్ణయం
మరి, టీడీపీ కేడర్ లోకేష్ ను డిప్యూటీ సీఎం కావాలనుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. దీని పైన పార్టీ అధినేతగా చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వర్మ వ్యాఖ్యానించారు. ఇక, పిఠాపురం నుంచి పవన్ గెలుపు లో సహకరించిన వర్మకు నాడు కూటమి అధికారంలోకి వస్తే కీలక పదవి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఏడు నెలలు పూర్తయినా ఇప్పటికీ నాడు పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎలాంటి పదవి దక్కలేదు. తాజాగా వర్మ అమరావతిలో సీఎం చంద్రబాబుతోనూ సమావేశమయ్యారు. పిఠాపురంలో జనసేన కేడర్ నుంచి వస్తున్న సమస్యలను ఆయనకు వివరించారు. అయితే, పవన్ తో వర్మ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
వర్మ వ్యాఖ్యలతో
పిఠాపురంలో వర్మకు సరైన ప్రాధాన్యత జనసేన నుంచి దక్కటం లేదని ఆయన మద్దతు దారులు వాపోతున్నారు. ఇక, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ మాత్రమే కొనసాగుతున్నారు. ఇప్పుడు పవన్ తో సమానంగా లోకేష్ కు అదే హోదా ఇవ్వాలనే డిమాండ్ పైన కూటమిలో చర్చ సాగుతోంది. ఇదే అంశం పైన టీడీపీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం తన మనసులో మాట బయట పెట్టటం లేదు. కాగా, తిరుపతి తొక్కిసలాట ఘటనతో టీటీడీ బోర్డు , అధికారులు బాధితులకు క్షమాపణ చెప్పాలనే పవన్ డిమాండ్ తో తమ పార్టీకి సంబంధం లేదని లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ వస్తున్న డిమాండ్లతో కూటమిలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications