చంద్రబాబు విష సర్పం: వాసిరెడ్డి, చెల్లి షర్మిలతో జగన్
హైదరాబాద్/నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగర్జన అంటూ ప్రజల ముందుకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హైదరాబాదులో ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెడుతున్న బాబు విష సర్పమని, దానిపై ప్రజలు గర్జించాలన్నారు. తెలంగాణ డిమాండుకు చంద్రబాబు కారణమన్నారు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలిపిందన్నారు.
విభజన బిల్లు అసెంబ్లీ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎందుకు దాక్కున్నారో తెలపాలన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని, ఇప్పుడు దానిని సరిదిద్దుకోవాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉపన్యాసాలు ఇవ్వకుండా సమైక్య నినాదం వినిపించాలన్నారు. చంద్రబాబును సమైక్యవాదులు నిలదీయాలన్నారు.
కీలకపాత్ర
రానున్న ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీదే కీలక పాత్ర అని ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి మంగళవారం అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గడపగడపకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారని, రాష్ట్రవిభజనకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
ఇడుపులపాయలో వైయస్కు నివాళి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించారు. వైయస్ విజయమ్మ, జగన్, షర్మిల, భారతి రెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్లు పాల్గొన్నారు.