ప్రజలను మర్చిపోయారు: మంత్రులపై వాసిరెడ్డి ధ్వజం
సీమాంధ్ర మంత్రులు రాష్ట్ర సమైక్యతను ఎందుకు కోరుకోవడం లేదని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. రాష్ట్ర విభజనను జరగనివ్వమంటూ గతంలో ప్రగల్భాలు పలికిన కేంద్రమంత్రులు ఇప్పుడు ఏం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. విభజనపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం కేంద్రమంత్రులకు లేదా అని ఆమె ప్రశ్నించారు.
జిఓఎంకు సవరణలు ఇవ్వడం అవమానకరమని వాసిరెడ్డి మండిపడ్డారు. తెలుగు ప్రజలు కత్తి పడుతుంటే.. ఎంపీలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం లాబీయింగ్ చేయడం దురదృష్టకరమని అన్నారు. కేంద్రంలో వారు లాలూచీ పడకపోతే విభజనను ప్రశ్నించేవారని చెప్పారు. ప్రజల ప్రయోజనాలను వారు మరిచిపోయారని ఆరోపించారు.
తమ పార్టీ మద్దతుతోనే రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ వేశానని ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అవాస్తవమని ఆమె అన్నారు. తాము రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ నుంచే దూరంగా ఉంటామని ముందే చెప్పామని వాసిరెడ్డి తెలిపారు.