బాబు ప్రచారంతో రాకుండా పోతోంది: వాసిరెడ్డి, లక్ష్మీపార్వతి కంటతడి
హైదరాబాద్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ప్రత్యేక హోదా కూడా రాకుండా పోతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం నాడు విమర్శించారు. పెట్టుబడులపై చంద్రబాబు ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం తీరును ప్రశ్నించిన తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల పైన కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఇది ప్రభుత్వం పిరికితనానికి నిదర్శనం అన్నారు. దావోస్ నుంచి గతంలో చంద్రబాబు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంకు అసహనం శ్రుతిమించుతోందని వైసిపి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని, దానిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ పైన ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.

కాగా, స్విట్జర్లాండులోని దావోస్ నగరంలో ఈ నెల 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరగనున్న 46వ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు అత్యున్నత అధికారుల బృందంతో సోమవారం సాయంత్రం చంద్రబాబు బయలుదేరి వెళ్తారు.
ఎన్టీఆర్ సమాధిని చూసి, కన్నీరుపెట్టిన లక్ష్మీపార్వతి!
స్వర్గీయ ఎన్టీఆర్ సమాధికి సరైన అలంకరణ లేకపోవడంపై లక్ష్మీపార్వతి కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా ఆమె హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం లక్ష్మీపార్వతి మాట్లాడారు.
ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజుల్లో ఆయన సమాధిని పూలతో అలంకరించాలని రెండు తెలుగు ప్రభుత్వాలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఆయన సమాధిని చూస్తే కడుపుతరుక్కుపోయిందని, అప్పటికప్పుడు హడావుడిగా కొన్ని పూలతో అలంకరించారని విమర్శించారు.












Click it and Unblock the Notifications