చంద్రబాబు చెప్పింది నిజం, ఏ కలెక్టర్ని మాట్లాడనివ్వలేదు: వాసిరెడ్డి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధ వాసిరెడ్డి పద్మ బుధవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో కొన్ని నిజాలు చెప్పారని ఆమె ఎద్దేవా చేశారు.
ఫైల్స్ కింద నుంచి రావడం లేదని చంద్రబాబు నిజం చెప్పారన్నారు. ఎందుకంటే ఏపీలో చంద్రబాబు, నారా లోకేష్ ఫైల్స్ తయారు చేసి కిందకు పంపిస్తున్నారన్నారు. అందుకే కింద నుంచి ఫైల్స్ రావడం లేదని ధ్వజమెత్తారు. ఈ విషయంలో బాబు వాస్తవం చెప్పారన్నారు.
చంద్రబాబు ప్రజలను కించపరిచి మాట్లాడటం సరికాదన్నారు. ఈ ప్రభుత్వం కమీషన్ల రాజ్యం, ముడుపుల రాజ్యం అన్నారు. ఉదయం జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఏ కలెక్టర్ను మాట్లాడనీయలేదన్నారు. సదస్సులు, సమీక్షలు కాలక్షేపం కోసమే అన్నట్లు కనిపిస్తున్నాయన్నారు.

చంద్రబాబు తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు అధికారులను బలిపశువులను చేయవద్దన్నారు. రాష్ట్రంలో అవినీతికి చంద్రబాబే కర్త, కర్మ, క్రియ అన్నారు. ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచి దోపిడీ చేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లకు, టీడీపీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడేలా ఫైల్స్ తయారు చేస్తున్నారన్నారు.
నాపై విమర్శలు తగవు: ముద్రగడ
సీఎం చంద్రబాబుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా లేఖ రాశారు. కాపుల ప్రయోజనాలను జగన్కు తాకట్టు పెట్టారని తనపై మంత్రులు విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఏనాడు శిలాఫలకాలపై తన పేరు రాయమని కోరలేదన్నారు.
కార్యక్రమంలో కొబ్బరికాయ అందరూ కొట్టిన తర్వాతే కొట్టేవాడినని, అటువంటిది తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జిల్లాలో ఎన్నో ప్రాజెక్టులకు తానే చంద్రబాబు పేరు పెట్టాలని సూచించేవాడినని చెప్పుకొచ్చారు. సంక్షేమ నిధి పథకాల ద్వారా టీడీపీ వారికే రుణాలివ్వడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications