ఆడవారిని తిట్టే నీచ సంస్కృతి టీడీపీది; చంద్రబాబులా జగన్ కుట్రలు చెయ్యలేదు: వాసిరెడ్డి పద్మ, తానేటి వనిత ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు మధ్య మాటల దాడి కొనసాగుతూనే ఉంది. పట్టాభి వ్యాఖ్యల దుమారంతో మొదలైన రచ్చ చిలికి చిలికి గాలివానగా మారింది. రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి టిడిపి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారని, తెలుగుదేశం పార్టీ నేతలు బూతులు మాట్లాడుతుంటే చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా రెండు రోజుల పాటు వైసీపీ జనాగ్రహ దీక్షలను నిర్వహించింది
చంద్రబాబులా జగన్ కుట్రలు చేసి అధికారంలోకి రాలేదు
ఇదిలా ఉంటే ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబులా కుట్రలు చేసి అధికారంలోకి రాలేదని పేర్కొన్నారు. ప్రజా బలంతో జగన్ గెలిచారని మంత్రి తానేటి వనిత స్పష్టంచేశారు. పథకాలకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక పట్టాభితో అసభ్యంగా మాట్లాడిస్తున్నారని మంత్రి తానేటి వనిత విమర్శించారు. రాష్ట్రంలో కావాలని అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు పై ధ్వజమెత్తారు తానేటి వనిత. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా ఆదరణ కోల్పోతున్న కారణంగానే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారన్నారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అప్పుడు ఏం చేశారో ? తానేటి వనిత
జగన్ ప్రభుత్వంపై గంజాయి ఆరోపణలు చేస్తున్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఏం చేశారో ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని మంత్రి తానేటి వనిత చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలు తీసుకుంటే ఇప్పటి ప్రభుత్వానికి ఇంత రిస్క్ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. తాజాగా ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ టిడిపి నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మహిళా పక్షపాత ప్రభుత్వమనే జగన్ పై కుట్రలు : వాసిరెడ్డి పద్మ
గతంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఏది లేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ లో మహిళల ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ ప్రాధాన్యత కు జగన్మోహన్ రెడ్డి దృఢనిశ్చయంతో ఉన్నారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. అంతేకాదు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులలో మహిళలకు అధికంగా ప్రాధాన్యతనిచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని చెప్పిన పద్మ, మహిళా పక్షపాతి అన్న దురుద్దేశంతో జగన్ పై కుట్రలు చేస్తే ఊరుకోబోమని టిడిపి నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.
మహిళా హోం మంత్రిని టీడీపీ నేతలు తిడతారా ?
రాష్ట్రంలో రాజకీయాలు ఆడవారిని కూడా తిట్టే నీచ సంస్కృతికి దిగజారిపోయాయని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ఇకనైనా ప్రతిపక్షాల నేతలు కుట్రను మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో మహిళల్లో గతంలో ఎన్నడూ లేనంతగా మార్పు వస్తుందని పేర్కొన్న వాసిరెడ్డి పద్మ మహిళా హోం మంత్రి మేకతోటి సుచరితని ప్రతిపక్ష పార్టీల నేతలు దూషించటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా హోం మంత్రిపై టీడీపీ నేతల దాడిని రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడిగా ఆమె అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ బూతులు మాట్లాడటంపై మండిపడిన వాసిరెడ్డి పద్మ బూతులు తిట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పేర్కొన్నారు .మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆమె వెల్లడించారు.