వెలిగొండ వెలుగుల దండ.. 30 ఏళ్ల తర్వాత ఇలా.. చంద్రబాబు ఆసక్తికర ట్వీట్!
ఏపీ ప్రభుత్వం వెలిగొండ పూలసుబ్బయ్య ప్రాజెక్ట్ నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికాగా, ఇది ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యింది. తాజాగా ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు 31న మార్కాపురం జిల్లాలో ఈ ప్రాజెక్టును తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
సర్వం సిద్ధం అయిన వెలిగొండ ప్రాజెక్ట్
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి భూనిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం కూడా అందిస్తోంది ఏపీ ప్రభుత్వం . ఇప్పటికి మూడు విడతలుగా పరిహారం అందించింది. ప్రభుత్వం ఇప్పటివరకు మూడు విడతల్లో 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు ప్రకటించింది. నిర్వాసితులకు ఇస్తామన్న పరిహారం అందించి ప్రాజెక్ట్ ప్రారంభిస్తామని ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వెల్లడించారు.ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధం చేసిన సమయంలో చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానన్న సీఎం
1996 మార్చి 5న ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ తన చేతుల మీదుగానే ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భగీరథ ప్రయత్నంతో అనేక అడ్డంకులు అధిగమించి ఫేజ్-1 పూర్తి చేశామని, కరువు నేలకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని చెప్పారు.
వెలిగొండ వెలుగుల దండ అంటూ సీఎం చంద్రబాబు
10.7 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా నల్లమల సాగర్కు విడుదల చేయనున్నారు. ఫేజ్-1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు, ఫేజ్-2తో 3.28 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. లక్షలాది మందికి తాగునీరు కూడా లభిస్తుంది. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలిగొండ వెలుగుల దండగా మారనుందన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రజల కలను నెరవేర్చి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశామన్నారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు
రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ప్రకటించారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. 'ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి' అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. ఈ వెలిగొండ పూల సుబ్బయ్య ప్రాజెక్ట్ ద్వారా కరువు పీడిత ప్రాంతాలలో పంటలు కళకళలాడనున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా, వైఎస్సార్ కడప జిల్లా, నెల్లూరు జిల్లాలకు లబ్ది చేకూరనుంది.














Click it and Unblock the Notifications