వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరికతో వైసిపికి లాభమేంటి?...టిడిపికి నష్టమేంటి?
నెల్లూరు జిల్లా: వైసిపి అధినేత జగన్ 73వ రోజు పాదయాత్ర గూడూరులో జరుగుతున్నసమయంలో ఆదివారం నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయనను కలుసుకొని ఆ పార్టీ లో చేరారు...ఈ ఘటనతో ఇటీవలి కాలంలో ఇదే విషయమై జరుగుతున్న ఊహాగానాలు వాస్తవరూపం దాల్చాయి. అయితే వేమిరెడ్డి చేరిక వల్ల వైసిపికి లాభమా? టిడిపి నష్టమా? ఎంత? అనే విషయమై అప్పుడే జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి చేరిక ఏ పార్టీ మీద ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం...
ఎట్టకేలకు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి కండువా కప్పుకున్నారు. ఎట్టకేలకు అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే...ఒకప్పుడు వైసిపిలోనే ఉండి 2014 ఎన్నికల్లోనే పరోక్షంగా వైసిపికి అండదండలు అందించిన వేమిరెడ్డి ఆ తరువాత సంభవించిన కొన్నిపరిణామాల కారణంగా మళ్లీ వైసిపిని దూరం పెట్టారు...ఆ తరువాత పార్టీలో ప్రత్యక్షంగా చేరడానికి ఇంత సమయం తీసుకున్నారు కాబట్టి...ఏదేమైనా ఆయన ఆదివారం ప్రత్యక్షంగా తన మద్దతుదారులతో సహా వైఎస్ఆర్సిపిలో చేరారు.
నేపథ్యం...హామీ...నెరవేరకపోవడం...
2014 ఎన్నికల్లో వైసిపికి పూర్తిస్దాయి అండదండలందిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జగన్ రాజ్యసభ స్ధానం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఆ పార్టీకి దక్కేది ఒకే స్ధానం కావటం, అప్పటి పరిణామాల రీత్యా జగన్ దాన్ని విజయసాయిరెడ్డికి కేటాయించారు. దాంతో మనస్థాపానికి గురైన వేమిరెడ్డి వైసిపికి దూరమైపోయారు. దీంతో ఆయన్ను ఎలాగైనా టిడిపిలోకి రప్పించాలని చాలా గట్టి ప్రయత్నాలే జరిగాయని తెలిసింది.
టిడిపి ప్రయత్నాలు...ఫైనల్ గా విఫలం
వైసిపికి దూరం అయిన తదనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేష్తో వేమిరెడ్డి భేటీ కావడం, వెంటనే టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అప్పట్లో రాజ్యసభ టిక్కెట్ వేమిరెడ్డికి ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం కూడా సరే అనడంతో ఆయన కూడా చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే రెండు పర్యాయాలు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా ముఖ్యమంత్రి సమక్షంలో టీడీపీలో చేరేందుకు ఆయన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ రెండుసార్లు కూడా ఆ కార్యక్రమాలు రద్దవడం, తాను కోరుకున్న రాజ్యసభ టిక్కెట్ సామాజిక సమీకరణాల పేరుతో కర్నూలుకు చెందిన మాజీ మంత్రి టిజి వెంకటేష్కు ఇవ్వడంతో వేమిరెడ్డికి ఈసారి టిడిపి నుంచి మొండిచెయ్యి ఎదురైంది. దీంతో మరోసారి తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన అప్పట్నుంచి ఏ పార్టీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించకుండా తన దాతృత్వ, ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే పూర్తిగా పరిమితమయ్యారు.
మరింత మంచి పేరు...
ధార్మిక కార్యక్రమాలతో...ధార్మిక కార్యక్రమాలతో...నెల్లూరు జిల్లాలోని మారుమూల గ్రామాలకు శుద్ధిచేసిన తాగునీటి వసతి కల్పించేందుకు సొంత నిధులతో ప్లాంట్లు, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వైసిపి ఒకలా దెబ్బ తీస్తే టిడిపి కూడా తనను రెండో సారి దెబ్బతీయడంతో ఇక ఆ పార్టీలో చేరేందుకు ఆయన పూర్తిగా అనాసక్తి కనబరుస్తూవచ్చారు. ఇదే సమయంలో వైకాపా నేతలు ఆయనతో అంతకంతకూ టచ్లోకి వెళ్లి ఆయన కోరుకుంటున్న హామీ ఇచ్చేందుకు సంసిద్దత కనబర్చి ఆయన తిరిగి వైకాపా చెంతకు చేరేందుకు సిద్ధపరిచారు.
దూరం నుంచి...మళ్లీ దగ్గరకి...ఇప్పుడెందుకంటే?...
ఒకనాటి పరిణామంతో వైసిపికి దూరమైన వేమారెడ్డి పట్ల జగన్ కు ప్రత్యేక సానుభూతి ఉన్నట్లు, ఆయన రాక పట్ల జగన్ కొంత ఎక్కువ గానే ఆసక్తి కనబరిచినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేపధ్యంలోనే వైసిపి తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు వేమిరెడ్డిని పార్టీలోకి తీసుకురావటానికి తీవ్రంగా ప్రయత్నించారు. జగన్ తో మాట్లాడిన తర్వాత వేమిరెడ్డికి అనుకూలమైన ఒక బలమైన హామీని పెద్దిరెడ్డి జగన్ తరపున తానే మాట ఇచ్చారట. దాంతో ఆయన వైసిపిలో చేరటానికి మార్గం సుగమం అయింది.
దక్కేది ఒక్కటే సీటంట...అది ఈయనకే నంట...
వైసిపి నేతల మాటలను బట్టి త్వరలో వైసిపికి దక్కుతుందని అనుకుంటున్న ఒకే ఒక్క రాజ్యసభ స్ధానాన్నివేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చేందుకు జగన్ అంగీకరించారని తెలుస్తోంది. దాంతో కొంత లేటయినా వేమిరెడ్డి తాను ఏదైతే కోరుకున్నారో అదే లభిస్తుండటంతో ఇక వైసిపిలోకి రావడానికి అభ్యంతరం ఏముంటుంది?...అందుకే ఎట్టకేలకు అలా ఆ పార్టీ కండువా కప్పుకొని లోపలికి వచ్చేశారంటున్నారు
Recommended Video
లాభమేంటి...నష్టమేంటి...ఎవరికేంటి?
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరటం వల్ల ఆ పార్టీకి ఒనగూరే ప్రత్యేక ప్రయోజనమంటూ ఏమీలేదు...కాకపోతే ఆయన వైసిపిలోకి వెళ్లకుండా ఆపాలంటే తమ పార్టీలోకి తీసుకోవాలని ప్రయత్నించారు..అంతే..ఆయన వైసిపిలో చేరడం వల్ల ఆ పార్టీకి ప్రత్యక్ష లాభాలూ...టిడిపికి పరోక్ష నష్టాలూ ఉన్నాయి. ఎలాగంటే...రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుపెట్టాలన్నది వాస్తవం...ఈ క్రమంలో టిడిపి అధికార పార్టీ కాబట్టి డబ్బు సమస్య ఉండక పోవచ్చు...కానీ వైసిపి అభ్యర్థి లేదా అభ్యర్థుల పరిస్ధితి ఏంటి?...ప్రస్తుతం టిడిపి అభ్యర్థులతో వైసిపి అభ్యర్థులు ఆర్థికంగా పోటీపడి పైచేయి సాధించేంత సీన్ చాలా చోట్ల లేదు..కాబట్టి ఈ తరుణంలో ఆర్ధికంగా బలమైన వేమిరెడ్డి లాంటి వాళ్ళు వైసిపిలో చేరటం వల్ల పార్టీకి కొంత ఆర్ధిక పరిపుష్ఠి సమకూరుతుందనడంలో సందేహం లేదు. సో...అదండీ వైసిపికి లాభం...