విభజన బిల్లుపై ఏపీ, టీ అసంతృప్తి: వెంకయ్య, పాక్, మమతపై ఆగ్రహం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కొన్ని మార్పులు, చేర్పులు అవసరమని, ఇందులో లోపాలు ఉన్నాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో, న్యాయనిపుణులతో, కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నామని చెప్పారు. లోపాలు సరిదిద్దేందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తామన్నారు.
యూపీఏ ప్రభుత్వం కొన్ని లొసుగులు, అనాలోచిత నిర్ణయాలతో చట్టం తెచ్చిందని విమర్శించారు. పునర్విభజన చట్టంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందన్నారు. చట్టం పైన చాలామంది ఎంపీలు అసంతృప్తితో ఉన్నారన్నారు. మార్పుల అంశంపై న్యాయపరిశీలనలో ఉందన్నారు. అయితే, ఇది మరో వివాదం కాకూడదని అందరినీ సంప్రదిస్తున్నామని చెప్పారు. పార్లమెంటులోను ప్రతిపక్షంగా సరిగా వ్యవహరించడం లేదన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై....

ఆంధ్రప్రదేదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన అభివృద్ధి మండలిలో చర్చించాలన్నారు.
ఏకపక్షంగా మతమార్పిడి చట్టం తీసుకురాం
తాము ఏకపక్షంగా మతమార్పిడి చట్టం తీసుకురామని వెంకయ్య చెప్పారు. మత మార్పిడి పైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో మత మార్పిడి చట్టం తెచ్చిందన్నారు. పార్లమెంటులో ప్రతిపక్షం తీరు బాధాకరమన్నారు.
పాకిస్తాన్ మినహా...
మన దేశానికి పాకిస్తాన్ మినహా మరే దేశంతోను విబేధాల్లేవన్నారు. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదని మండిపడ్డారు.
మమతపై ఆగ్రహం
సీబీఐ వ్యవహారాల్లో కేంద్రం ఎప్పుడూ జోక్యం చేసుకోదని చెప్పారు. సీబీఐ ఎవరిని అరెస్టు చేసినా కేంద్ర ప్రభుత్వమే చేసిందనడం దుర్మార్గమన్నారు. పశ్చిమ బెంగాల్లో పట్టు కోల్పోవడం జీర్ణించుకోలేక మమతా బెనర్జీ ఆరోపణలు చేస్తున్నారన్నారు. అవినీతి మంత్రులకు ఆమె అండగా ఎందుకు నిలబడుతున్నారో చెప్పాలన్నారు. రష్యా, చైనా దేశాలు మారినా మన దేశంలో కమ్యూనిస్టుల దృక్పథం మారడం లేదన్నారు.












Click it and Unblock the Notifications