టిపై చర్చకు సిద్ధం: బాబు, అప్పుడేం చేశారు: వెంకయ్య
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు ప్రజాస్వామికంగా ఉందని ఎవరైనా భావిస్తే తాను చర్చించేందుకు సిద్ధమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సవాల్ విసిరారు. ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెసు పార్టీలో కలుస్తుందన్నారు. శాసన సభ తీర్మానం లేకుండా ఇప్పటి వరకు ఎక్కడా విభజన జరగలేదన్నారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లుపై జాగ్రత్తగా ముందుకెళ్తారని భావించానని చెప్పారు. కాంగ్రెసు తీరుపై అన్ని ప్రాంతాలు, పార్టీల నుండి అభ్యంతరాలు వచ్చాయన్నారు.
బిల్లు ఆమోదం కోసం అవలంభించిన తీరు బాధించిందన్నారు. తెలంగాణ విభజనన సంప్రదాయాలు పక్కన పెట్టి చేశారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. తాను ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశానని కానీ ఫలించలేదన్నారు. దానికి తమకు పార్లమెంటులో సభ్యులు లేకపోవడమే అన్నారు. తమకు సభ్యులు లేకపోవడం వల్లనే అడ్డుకోలేకపోయానని చంద్రబాబు చెప్పారు.

మొదట్నుంచి కాంగ్రెసు పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రత్యక్ష ప్రసారాన్ని ఎందుకు ఆపివేశారని ప్రశ్నించారు. కాంగ్రెసు అప్రజాస్వామిక పద్ధతిని మాటల్లో చెప్పడం తన వల్ల కావడం లేదన్నారు. సమాజం శాశ్వతమని, రాజకీయ పార్టీలు అశాశ్వతమన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెసు వ్యవహరించిందన్నారు. తమ పార్టీలోను విభజన తెచ్చే ప్రయత్నం తెచ్చిందన్నారు.
కాంగ్రెసు పార్టీ పథకం ప్రకారమే జగన్ను బయటకు తెచ్చి సమైక్యవాదిగా ముందుకు తీసుకు వచ్చిందన్నారు. ఉద్యోగులు ఢిల్లీలో ఆందోళన చేస్తే మీడియా జగన్ను హైలెట్ చేసిందన్నారు. కేంద్రం దుర్మార్గంగా వ్యవహరించినప్పుడు ప్రతిపక్షం గట్టిగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఇంతవరకు జరిగిన విభజనలు అన్ని పద్ధతి ప్రకారం జరిగాయని, ఇప్పుడు మాత్రం సంప్రదాయాలను తుంగలో తొక్కారని అన్నారు.
విభజన ప్రక్రియలో అనేక ఉల్లంఘనలు జరిగాయన్నారు. సోనియా నియంతృత్వానికి తెలుగు జాతి మొత్తం నష్టపోయిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పు కాదని, అందుకు అవలంభించిన విధానమే తప్పన్నారు. ఇప్పటి వరకు ఎన్నో విభజనలు జరిగాయని, భవిష్యత్తులోను జరుగుతాయన్నారు. తాను తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేకం కాదని, 2008లోనే సమన్యాయం కోసం లేఖ ఇచ్చామన్నారు. 2004, 2009లో అధికారం ఇస్తే రాష్ట్రానికి కాంగ్రెసు చేసేది ఇదా అన్నారు.
అప్పుడేం చేశారు: వెంకయ్య
పదేళ్ల నుండి కాంగ్రెసు పార్టీ తెలంగాణ బిల్లును ఎందుకు తీసుకురాలేక పోయిందని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. మీ ముఖ్యమంత్రి, మీ కేంద్రమంత్రులు, మీ మంత్రులు, మీ నేతలు ఎలా ఇస్తారని సవాల్ చేస్తుంటే కాంగ్రెసు పార్టీ ఏం చేస్తుందన్నారు. బిజెపి తెలంగాణ విషయంలో మొదటి నుండి స్పష్టంగా ఉందన్నారు. కాంగ్రెసు పార్టీయే డబుల్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. బిజెపిని ప్రశ్నించే హక్కు కాంగ్రెసుకులేదన్నారు. మీ సిఎం మీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఏం చేశారని సవాల్ చేశారు.
తాను కాంగ్రెసు పార్టీకి సవాల్ చేస్తున్నానని తమ పార్టీ ఎంపి ఒక్కరు కూడా వెల్లోకి వెళ్లలేదన్నారు. కాంగ్రెసు పార్టీ విధానం తప్పన్నారు. బిల్లుకు తాము మద్దతు పలికామని అయితే, విధానం మాత్రం సరికాదన్నారు. బిల్లు విషయంలో నిర్మాణాత్మక సూచనలు ఇస్తే పట్టించుకోలేదన్నారు. అకస్మాత్తుగా సభలో చర్చ మొదలు పెట్టి ఎవరికి అవకాశం ఇవ్వకుండా చేసింది.
తమకు తెలంగాణ, సీమాంధ్ర రెండు ముఖ్యమే అన్నారు. బిజెపి భారత దేశం కోసం పని చేస్తోందన్నారు. మనమంతా తెలుగువారమని, విడిపోయేటప్పుడు సామరస్యంగా విడిపోదామన్నారు. బిజెపి కేవలం ప్రతిపక్ష పార్టీ మాత్రమే అన్నారు. తాము అధికారంలో ఉంటే ఇరు ప్రాంతాలకు న్యాయం చేసి విభజించే వారమని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications