ఎపికి ప్రత్యేక హోదా రగడ: తాను అలా అనలేదని వెంకయ్య వివరణ
న్యూఢిల్లీ/ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై వివాదం ముదురుతోంది. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తగిన అర్హతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేవని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నట్లు వచ్చిన వార్తలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. దీంతో ఆ విషయంపై వెంకయ్య నాయుడు సోమవారం వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు ఎపికి లేవని తాను అనలేదని ఆయన స్పష్టం చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నామని వెంకయ్యనాయుడు చెప్పారు. గాడ్గిల్ ఫార్ములా కొలమానాల పరిధిలో ఏపీ లేదని, ఏపీకి ప్రత్యేక హోదాపై విభజన సమయంలోనే బిల్లులో చేర్చి ఉంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు.
రెవెన్యూ లోటు ఉన్నందున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, దీనిపై ఆర్థికమంత్రి సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఏపీకి ఆర్థికలోటు భర్తీ చేస్తామని హామీ ఇచ్చామని, బిల్లులో చేర్చకపోయినా ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదాపై సానుకూలంగా పరిశీలన జరుపుతుందని వెంకయ్యనాయుడు వివరించారు.
ఇదిలావుంటే, ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు చంద్రబాబు చొరవ తీసుకొని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని అఖిలపక్షాల నేతలు విజ్ఞప్తి చేశారు. విశాఖలో ప్రత్యేక హోదా సాధనపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు సీపీఐ నారాయణ, సీపీఎం మధు, టీడీపీ నేత కంభంపాటి, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రి బొత్స, కారెం శివాజీలు పాల్గొన్నారు. తాను విశాఖకు రైల్వేజోన్ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాశానని ఎంపీ సుబ్బరామిరెడ్డి చెప్పారు.