సభలో కీర్తిస్తారా? అక్బర్ 'నిజాం' వ్యాఖ్యలపై వెంకయ్య
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ శాసన సభలో నిజాంను లౌకికవాది అంటూ కీర్తించడం శోచనీయమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మంగళవారం అన్నారు. రజాకారులు నిజాంను కీర్తిస్తే అర్థం ఉందని, ఎమ్మెల్యేలు అలా వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు.
నిజాం లౌకికవాది అనడం విడ్డూరమన్నారు. నిజాం పాలనపై అంత సుదీర్ఘ ప్రసంగం చేసిన అక్బరుద్దీన్ రజాకార్ల అరాచకాలను ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు. తెలంగాణ విషయంలో తమది ఎప్పటికే ఒకటే విధానమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తాము అనుకూలంగా ఉన్నామని చెప్పారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని, దానిపై వెనక్కి పోయే ప్రసక్తి లేదన్నారు.
కాగా, తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ సమయంలో శాసన సభలో మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం నిజాం రాజు చేసిన అభివృద్ధిపై గడగడా చదువుకుంటూ పోయారు. ఇప్పుడు మనం కూర్చున్న అసెంబ్లీ కూడా నిజాం కట్టిందేనని వ్యాఖ్యానించారు. నిజాం పేరు చెప్పి తెలంగాణను అడ్డుకుంటారా, నిజాంకు, రాష్ట్ర విభజనకు ఏం సంబంధమని, తెలంగాణను ఎవరు ఆపలేరని అక్బరుద్దీన్ అన్నారు.
హైదరాబాదును, తెలంగాణను నిజాం ఎంతో అభివృద్ధి చేశారన్నారు. 1854లోనే నిజాం విద్యా సంస్థలను నెలకొల్పారన్నారు. తెలంగాణవ్యాప్తంగా పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగాలు కల్పించారన్నారు. ఆంధ్రప్రదేశ్ విలీనం ముందే సర్ ప్లస్ స్టేట్ ఇచ్చారన్నారు. నిజాం కాలంలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ హబ్గా మారిందన్నారు. సీమాంధ్ర నుండి వచ్చిన ఎందరో నేతలు హైదరాబాదులో చదువుకున్నారన్నారు.