ప్రవర్తన బాధాకరం: రోజాపై వెంకయ్య వ్యాఖ్య, బాబుకు కాపు పౌరుషం చూపిస్తామన్న అంబటి
ఏలూరు/ హైదరాబాద్ : చట్ట సభలు విమర్శలకు వేదికలవుతున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యానాయుడు అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ కాంస్య విగ్రహాన్నిసోమవారం వెంకయ్య ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ఓ మహిళా ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు బాధాకరమని అన్నారు. సభ జరిగే సమయం కన్నా వాయిదా సమయం ఎక్కువ అవుతోందని వెంకయ్య వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుల పౌరుషాన్ని చవిచూడక తప్పదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీనే తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.
సెక్షన్ 30 అమలు చేసినా కాపు గర్జన ఆగే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైన కాపు గర్జనకు తామంతా బాసటగా నిలుస్తామమని రాంబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి కాపు కులస్తులంటే ఏంటో కాపు గర్జన ద్వారా తెలియజేస్తామని రాంబాబు అన్నారు.
అది పెద్ద స్కామ్
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ అనేది ప్రభుత్వం నిర్వహించే పెద్ద స్కామ్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలోని భూములను పెట్టుబడిదారులకు, డబ్బున్న పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నమే క్రమబద్దీకరణ అని ఆయన సోమవారం విజయవాడలో మీడియా సమావేశంలో ఆరోపించారు.
భూములను ఇప్పటి వరకు 33 సంవత్సరాల లీజుకు ఇచ్చే విధానం ఉందని, దీన్ని చంద్రబాబు నాయుడు 99 సంవత్సరాలకు పెంచారన్నారని ఆయన ఆరోపించారు. ఇపుడు అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ అంటే ఒక సెంటు భూమి కూడా పేదలకు మిగలదని రామకృష్ణ స్పష్టం చేశారు.