‘అమ్మ’ అని అందుకే పిలుచుకుంటారు: వెంకయ్య, రోశయ్య విచారం
దివంగత ముఖ్యమంత్రి జయలలిత గొప్ప పాలనాదక్షురాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత గొప్ప పాలనాదక్షురాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అపోలో ఆస్పత్రి వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నించినా ఆమె ప్రాణం దక్కలేదని చెప్పారు. తమిళనాడు ప్రజలకు ఈ సందర్భంగా ఆయన సంతాపం ప్రకటించారు.
జయలలిత నిరంతరం ప్రజా సేవలోనే ఉన్నారని, అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని.. అందుకే ఆమెను ప్రజలు 'అమ్మ' అని అప్యాయంగా పిలుచుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు సేవ చేస్తూ.. రాజకీయ ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. ఆమె పురుచ్చితలైవిగా ఎదిగారని అన్నారు.
People Pay Homage To J Jayalalithaa
రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు. జయలలితతో తాను చివరిసారిగా చెన్నై మెట్రో కార్యక్రమం సందర్భంగా ఒకే వేదిక పంచుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఆమె తెలుగులో కూడా అనర్గళంగా మాట్లాడగలరని చెప్పారు. నెల్లూరులో కూడా ఆమెకు బంధువులున్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వానికి జయలలిత సహకరించారని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రస్తుతం ఆమె లేకున్నా.. ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కాగా, జయలలిత.. వెంకయ్యను సోదరుడని, తమ రాష్ట్రానికి ఏం కావాలన్నా ఆయన చేసిపెడతారని కొంత కాలం క్రితం ప్రకటించడం గమనార్హం.
ఎలాంటి వివాదాలు లేవు: రోశయ్య విచారం
జయలలిత మృతి పట్ల తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య విచారం వ్యక్తం చేశారు. తాను మొన్నటి వరకూ తమిళనాడు గవర్నర్గా పని చేశానని చెప్పిన రోశయ్య.. ఐదేళ్లలో కూడా ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు. ఆమె మంచి పరిపాలనాదక్షురాలని అన్నారు. పేద ప్రజల పట్ల ఆమెకు ఎంతో మమకారం ఉందని చెప్పారు.

అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు చేరువయ్యారని తెలిపారు. ఆమె ప్రజల మనసుల్లో గూడు కట్టుకున్నారని అన్నారు. జయలలిత ఇంకొంత కాలం జీవించి ఉండి తమిళనాడుకు, దేశానికి సేవ చేయాలని భావించే వాళ్లలో తాను కూడా ఒకడినని చెప్పారు. కానీ, విధి ఆమెను తీసుకెళ్లిందని.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా తమిళ ప్రజలు, ఆమె అభిమానులకు సానుభూతి తెలిపారు.












Click it and Unblock the Notifications