విభజకు నేను ఓకే, కానీ: వెంకయ్య, కేసీఆర్పై కోదండ
నెల్లూరు/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి ఇచ్చిన హామీలన్నీ తప్పక నేరవేర్చుతామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు శనివారం స్పష్టం చేశారు. విభజనకు తాను అనుకూలమని, అయితే విభజన తరువాత జరిగిన పరిణామాలు బాధ కలిగించాయన్నారు.
విభజన తరువాత ఆంధ్రకు ఏర్పడిన బడ్జెట్ లోటు, ఇచ్చిన హామీలు అమలు పన్నులు మినహాంపు, ప్రత్యేక హోదా, ఐఐటిలు, ఎయిమ్స్లు, కేంద్ర వర్శిటీలు, కారిడార్లు, రైల్వే జోన్లు ఏర్పాటు అన్నిటినీ కేంద్రలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
అయితే దేశ ఆర్థిక పరిస్థితి కూడా సక్రమంగా లేదన్నారు. రాత్రికే రాత్రే జరిగిపోయే పనులు కావని, ఈ విషయాన్ని తెలుగు ప్రజలు గుర్తించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పైన తెలంగాణ నేతల విమర్శలు అర్ధరహితమన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ ఆంధ్రాకే చెందిందన్నారు.
కేసీఆర్పై జేఏసీ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను రాజకీయ జేఏసీ అభినందించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కేబినెట్ సమావేశంలో ఆమోదించిన 43 అంశాలపై శనివారం జేఏసీ కార్యాలయంలో కోదండరాం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. సీఎం ప్రకటించిన వరాలన్నీ తెలంగాణ ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయని అన్నారు.