పవన్కు వెంకయ్య ఝలక్: రుణమాఫీని వివక్షతో ముడిపెట్టవద్దు!..
రుణమాఫీ విషయంలో ఉత్తర, దక్షిణ అన్న భేదాభిప్రాయాలు తీసుకురావద్దని పరోక్షంగా పవన్ కు వెంకయ్య సూచించారు.
అమరావతి: దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందంటూ గత కొంతకాలంగా గళం వినిపిస్తున్న పవన్ కళ్యాణ్.. రుణమాఫీ విషయంలోను కేంద్రం వ్యవహరిస్తున్న తీరును వివక్షగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని దేశ సమగ్రతకు ముడిపెడుతూ కేంద్రం చర్యలను జనసేన అధ్యక్షుడు పవన్ తప్పుబట్టారు.
బీజేపీకి పంచ్: ఈ వివక్ష ఏమిటని నిలదీసిన పవన్ కళ్యాణ్
ఈ నేపథ్యంలో పవన్ ట్విట్టర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. యూపీలో రుణమాఫీకి కేంద్రప్రభుత్వానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. రుణమాఫీ అంశం ఆయా రాష్ట్రాల ఆర్ధిక వనరులపై ఆధారపడి ఉంటుందని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు.
అదే సమయంలో యూపీలో రైతు రుణమాఫీకి కేంద్రం నిర్ణయం తీసుకోవడం, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి పార్టీ తీసుకున్న నిర్ణయం అని వెంకయ్య పేర్కొనడం గమనార్హం. రుణమాఫీ విషయంలో ఉత్తర, దక్షిణ అన్న భేదాభిప్రాయాలు తీసుకురావద్దని పరోక్షంగా పవన్ కు ఆయన సూచన చేశారు. కాగా, నేటి సాయంత్రం యూపీ సీఎంగా ఎవరిని నియమించాలనే దానిపై లక్నోలో పార్టీ సమావేశం జరగనున్నట్లు వెంకయ్య చెప్పారు. సమావేశానికి ఆయన పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.