పేరెత్తకుండా పవన్ కల్యాణ్ను ఉతికి ఆరేసిన వెంకయ్య
పేరెత్తకుండా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వెంకయ్య నాయుడు కొట్టిపారేశారు. ఉత్తరాది పెత్తనమంటూ అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని దెప్పి పొడిచారు.
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా ఆయన చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు కొట్టిపారేశారు. ప్రత్యేక హోదాపై నెలకొన్న వివాదం నేపథ్యంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన శనివారం మీడియా సమావేశంలో స్పందించారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఉత్తరాది పెత్తనమంటూ అనవసరమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడడం మంచిదని ఆయన పరోక్షంగా పవన్ కల్యాణ్కు సూచించారు. దేశమంతా ఒక్కటేనని, ఇంకా ఉత్తరాది, దక్షిణాది ఏమిటని, ఇది తెలుసుకోకపోతే ఎలా అని ఆయన అన్నారు.
ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొట్టడం పద్ధతి కాదని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రత్యేక హోదాను మించిన ప్యాకేజీని ఎపికి కేందర ప్రభుత్వం ఇస్తోందని, అయినా పెట్టుబడులు పెట్టేవారు ఎవరు కూడా హోదాను కోరడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయని పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే.
వెంకయ్య నాయుడు తన కూతురికి చెందిన స్వర్ణభారతి ట్రస్టుపై చూపించే శ్రద్ధ ప్రత్యేక హోదా సాధనపై చూపించి ఉంటే ఈపాటికి ఫలితాలు వచ్చి ఉండేవని కూడా పవన్ కల్యాణ్ అన్నారు. వెంకయ్య నాయుడును లక్ష్యంగా చేసుకుని ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
జల్లికట్టు ఆటను 2011లో కాంగ్రెస్ పార్టీయే నిషేధించిందని, కానీ జల్లికట్టు కోసం తమ పార్టీ ఆర్డినెన్స్ ఇచ్చిందని వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. జల్లికట్టు ముసుగులో తమ బిజెపిపై విమర్శలు చేస్తున్నారని ఆయన తప్పు పట్టారు. దేశంలో మిషన్ మోడీ నడుస్తోందని చెప్పారు. కొంతమందికి పనిలేక ట్విటర్పై కూర్చుంటున్నారని, ఫాలోయింగ్ లేని ట్విటర్ పోస్టింగ్లు వృధా అని ఆయన అన్నారు. ప్రధాని ట్విటర్లో లక్షలమంది ఫాలో అవుతున్నారని చెప్పారు.