నినాదాలు సరే, వెళ్లి చూడండి: పవన్కు వెంకయ్య, నోరు జాగ్రత్త.. శివాజీకి టిడిపి
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు శుక్రవారం నాడు స్పందించారు. ఆయన వ్యాఖ్యల పైన తాను సమయానుకూలంగా స్పందిస్తానని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మించిన సాయం అందించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు.
వారం రోజుల క్రితం తిరుపతి బహిరంగ సభలో వెంకయ్య నాయుడు పైన పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. వెంకయ్య గారు తెలుగువారు అని, ఆయన ప్రత్యేక హోదా పైన మాట మార్చవద్దని జనసేన అధినేత హితవు పలికారు. దీనిపై వెంకయ్య తాజాగా స్పందించారు.
ఏపీకి హోదా కోసం నినాదాలు చేస్తున్నారని, దాని ప్రయోజనం ఏ పాటిదో తెలుసుకోవాలంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు వెళ్లి చూస్తే తెలుస్తుందన్నారు. ఏపీకి సంపూర్ణ సాయం అందించాలన్న తపన తనకు కూడా ఉందన్నారు. అందుకు తగ్గట్లు ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆలయాలు, మసీదులు కూలగొట్టాలన్నదే తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు.
శివాజీ పైన టిడిపి నేతల నిప్పులు
కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి చౌదరి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ పైన తెలుగుదేశం పార్టీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. సుజన పైన శివాజీ వ్యాఖ్యలు అభ్యంతరకరమని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని సుజనా ఏనాడూ వ్యాపారాలు చేయలేదన్నారు.
వ్యాపారాలు చేస్తూనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు వేరు, ఆర్థిక నేరాలు వేరన్నారు. సుజనా ఏనాడూ ఆర్థిక నేరాలకు పాల్పడలేదన్నారు. శివాజీ అసలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అది సరికాదన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ.. హీరో శివాజీ నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు.
టూర్కు చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబంతో కలిసి టూర్కు బయలుదేరారు. ఈ నెల 5వ తేదీ వరకూ ఆయన కుంటుంబంతో కలసి హాలీడే ఎంజాయ్ చేయనున్నారు. అయితే ఆయన వ్యక్తిగత యాత్ర విశేషాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. పనుల ఒత్తిడిలో పడిన చంద్రబాబు కుటుంబంతో సరదాగా గడిపేందుకు యాత్రకు వెళ్లారు.