జగన్తో వద్దు, మొదటికే మోసం!: రాజ్యసభపై బాబుకు వెంకయ్య
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి పైన నాలుగో అభ్యర్థిని బరిలోకి దించడం ద్వారా ప్రతిపక్ష నేత వైయస్ జగన్కు షాకివ్వాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే, ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నాలుగో అభ్యర్థి పైన సూచన చేసినట్లుగా తెలుస్తోంది.
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు పోటీ ఎన్నిక జరగనుంది. బలం ప్రకారం టిడిపి - బిజెపి మిత్రపక్షం మూడు, వైసిపి ఒక స్థానం గెలుచుకుంటుంది. అయితే, వైసిపి నుంచి తమ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, వైసిపిలో తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలతో కలిపి జగన్కు షాకివ్వాలని టిడిపి భావించింది.
వైసిపి నుంచి విజయ సాయి రెడ్డి బరిలో నిలిచారు. ఆయన పైన పోటీ పెట్టాలని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. అయితే, బలం లేదు కాబట్టి పోటీ సరికాదని వెంకయ్య సూచించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు కూడా వెనక్కి తగ్గినట్లుగానే తెలుస్తోంది.
తెలంగాణలో రెండు, ఏపీలో నాలుగు స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో డీ శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీ కాంతారావులు నామినేషన్ దాఖలు చేశారు. మరెవరూ పోటీ చేయడం లేదు. దీంతో ఏకగ్రీవం కానుంది. బాబు తగ్గడంతో ఏపీలోను నలుగురే బరిలో నిలవనున్నారు. ఇక్కడా ఏకగ్రీవం కానున్నాయి.
నాలుగో స్థానం పైన చంద్రబాబు సోమవారం నాడు వైసిపి నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ నేపథ్యంలో రాజ్యసభకు రాజస్థాన్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన వెంకయ్య.. చంద్రబాబుతో మాట్లాడారు. మూడు సీట్లకు పోటీ చేస్తే ఏకగ్రీవంగా ఆ స్థానాలను దక్కించుకోవచ్చునని, నాలుగో సీటు కోసం పోటీకి దిగితే మిగిలిన మూడు సీట్లకు కూడా ఎన్నికలు జరగక తప్పదని, ఇది మొదటికే మోసం తెచ్చే పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించారని తెలుస్తోంది.
రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో స్థానంలో పోటీ చేయాలని టిడిపి మొదటి నుంచి ఉవ్వీళ్లూరింది. అయితే టిడిపి ఆశల పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు నీళ్లు చల్లినట్లుగా తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి, బీజేపీ మిత్రపక్షం మూడు స్థానాల్లోనే పోటీ చేయాలని, మరో స్థానంలో పోటీ చేస్తే ఎన్నికలు అనివార్యమవుతాయని, కాబట్టి నాలుగో అభ్యర్థిని నిలపకపోవడమే ఉత్తమమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సూచించినట్లుగా తెలుస్తోంది.