6 మండలాలతో పోయేదేం లేదు: వెంకయ్య, చమత్కారం
విజయవాడ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం తెలంగాణ రాష్ట్ర సమితి పైన నిప్పులు చెరిగారు. విజయవాడకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము తెలంగాణకు నష్టం జరగనివ్వదన్నారు. కానీ, సీమాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రెచ్చగొట్టే మాటలతో ప్రాంతీయ విభేదాలు సృష్టించవద్దని చెప్పారు. ముంపు మండలాలను బంగ్లాదేశ్లో కలపడం లేదు కదా అని ఎద్దేవా చేశారు. ఆరు మండలాలు ఇటున్నా.. అటున్నా పోయేదేం లేదన్నారు. ఆ నాయుడు, ఈ నాయుడు కుమ్మక్కు అనడం సరికాదన్నారు. నాయుడు అంటే నాయకుడు అని గుర్తు పెట్టుకోవాలని చురకలు అంటించారు.

పోలవరం ఆంధ్రా ప్రజల జీవన రేఖ అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాస్త సమయం పడుతుందని చెప్పారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇచ్చారని, దానిని నెరవేరుస్తామన్నారు. అది పదేళ్లు కూడా కావొచ్చన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థానం ఖాళీ అయిపోయిందని, కష్టపడి ఆ స్థానాన్ని ఆక్రమించాలని సూచించారు. టిడిపి తరువాతి స్థానంలో బిజెపి ఉండాలని ఆకాంక్షించారు. శక్తి వంచనలేకుండా కృషి చేస్తే అది పెద్ద కష్టం కాదన్నారు. కాళ్లకు నమస్కారం పెట్టడం సంస్కారం కాదని, చేతులు జోడించి నమస్కరించడం సంస్కారమని ఆయన తెలిపారు. తన కాళ్లకు నమస్కరిస్తే పంచె పట్టుకోవాలి, వారిని లేపాలి కాస్త కష్టమని ఆయన చమత్కరించారు.












Click it and Unblock the Notifications