జైలుకెళ్తే గొప్పా: వెంకయ్య, ఫ్యాక్షన్ వద్దని విజయమ్మపై
విశాఖ: జైలుకు వెళ్లి గొప్పలు చెప్పుకునే దౌర్భాగ్యస్థితి ఏర్పడిందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఒకనాడు ప్రజాసమస్యలపై పోరాడి తాము జైలుకు వెళ్లినా ఏనాడూ చెప్పుకోలేదన్నారు. నేడు ప్రజాధనాన్ని లూటీ చేసి జైలుకు వెళ్లి గొప్పలు చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తే వినాశనం తప్పదన్నారు.
ప్రస్తుతం రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉందని, ఇందుకు కారణమైన యూపిఏ కూటమిపై సీమాంధ్ర ప్రజలు కసితో, ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదన్నారు. కేంద్రం, రాష్ట్రంలోనూ అరాచక పాలన నడిచిందన్నారు.

కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఒకే గూటి పక్షులన్నారు. 2004లో ఎన్డీయే ప్రభుత్వం ఉండగా తెలంగాణను వైయస్ డిమాండ్ చేయలేదా?, ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించుకోవచ్చునని జగన్ చెప్పలేదా? అని ప్రశ్నించారు. రాజకీయాలకు కావలసింది వారసత్వం కాదని, జవసత్వమన్నారు.
విశాఖ అభివృద్ధికి అవసరమైన నిధులు మోడీ నుంచి నేరుగా సాధించే సత్తా ఉన్న వ్యక్తి కంభంపాటి హరిబాబును గెలిపించాలన్నారు. విశాఖ అభివృద్ధి చెందాలంటే ఫ్యాక్షన్ నేతల్ని ప్రోత్సహించవద్దన్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందన్నారు. కోట్లాది రూపాయల నిధులు, మద్యం పట్టుకున్నా అవి ఏ పార్టీకి చెందినవో.. ఏ నాయకుడికి చెందినవో ఎందుకు చెప్పడం లేదన్నారు.












Click it and Unblock the Notifications