కెసిఆర్ని పిలవడం భేష్, రాజకీయమొద్దు, హైద్రాబాద్తో పోలిక వద్దు: వెంకయ్య
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కెసిఆర్ను ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించడం శుభసూచకమని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సోమవారం అన్నారు. చంద్రబాబుతో కలిసి వెంకయ్య గన్నవరం విమానాశ్రయంలో నిర్మించనున్న కొత్త టెర్మినల్కు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. ఎప్పటికైనా తెలుగు వారంతా ఒక్కటే అన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయవద్దన్నారు. అభివృద్ధి జరగాలంటే త్యాగాలు తప్పనిసరి అన్నారు. భూసేకరణ పైన కొందరు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి కేంద్రం సాయం నిరంతరంగా కొనసాగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శక్తిమంతమైన రాష్ట్రంగా చేద్దామన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే త్వరగా పనులు చేస్తారని పారిశ్రామికవేత్తలు చాలామంది భావించారని, దానిని విని తాను సంతోషించానని చెప్పారు. రాష్ట్రానికి సమర్థమంతమైన నాయకత్వం కావాలన్నారు. అది చంద్రబాబు రూపంలో దొరిగిందన్నారు.

తెలుగు రాష్ట్రాలు రెండు కూడా పరస్పరం కలిసి పని చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఏపీ సీఎం కెసిఆర్ ఇంటికి వెళ్లి అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించామని, ఇది శుభపరిణామం అన్నారు. మనకు మంచి ప్రధాని ఉన్నారని చెప్పారు. గతాన్ని చూసి బాధపడవద్దన్నారు.
మనం హైదరాబాదుతోనే, శంషాబాద్ విమానాశ్రయంతోనే పోల్చుకోవద్దని ఏపీ ప్రజలకు సూచించారు. ఒకరి పైన కోపంతో కాకుండా... మనకు మనంగా అభివృద్ధి చెందాలని వెంకయ్య నాయుడు అన్నారు. రాజధానికి, గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో పలు పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరుకు కూడా పరిశ్రమలు వస్తున్నాయన్నారు. తాడేపల్లిగూడెంలో కూడా నిట్ మంజూరు చేశామన్నారు. దానిని మంత్రి మాణిక్యాల రావు పట్టుబట్టి మంజూరు చేయించుకున్నారని చెప్పారు.
కేంద్రం అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని చూస్తుందన్నారు. విభజన ద్వారా ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టి ఆ మేరకు కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేయాలన్నారు. నరేంద్రుడు, చంద్రుడు కలిసి పని చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కందిపప్పు ధర బాగా పెరిగిందని, దీంతో కేంద్రం దీనిపై చర్చిస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications