పవన్కు మరింత ధీటుగా: ఏపీ నిధులపై వెంకయ్య 'లెక్క', 'కేంద్రమంత్రి కనిపించట్లేదు'
తిరుపతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రమంత్రి, బిజెపి నేత వెంకయ్య నాయుడు మంగళవారం నాడు సమీక్షించారు. ప్రతి శాఖ నుంచి ఏపీకి చేస్తున్న, చేయాల్సిన అంశాలపై వెంకయ్య సమీక్షించారు.
కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సుష్మా స్వరాజ్, మనోహర్ పారికర్, పీయూష్ గోయల్తో వెంకయ్య నాయుడు చర్చించారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఏపీకి ఏం చేస్తోందని, ప్యాకేజీ పేరుతో చట్టంలో చెప్పినవే చేస్తోందని చెబుతున్న విపక్షాలకు మరింత ఘాటుగా కౌంటర్ ఇచ్చే ఉద్దేశ్యంలో ఆయన ప్రతి శాఖ నుంచి ఏపీకి చేస్తున్న, చేయాల్సిన అంశాలపై సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు జనసేన అధినేత పవన్ హోదా గురించి ప్రశ్నిస్తోన్న విషయం తెలిసిందే. కాగా, ఏపీకి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ కావాలని డిమాండ్లు కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు.
అశోక్ గజపతి రాజు కనిపించడం లేదని ఫిర్యాదు
కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అశోక్ గజపతి రాజు కనిపించడం లేదంటూ చిత్తూరు జిల్లా తిరుపతి పోలీస్ స్టేషన్లో లెఫ్ట్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతిలో వామపక్ష నాయకులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపాయి.
అశోక్ గజపతిరాజు కనిపించడం లేదంటూ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులపై విపక్షాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజుపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ సభలో కేంద్రమంత్రులను విమర్శించారు.