నన్నే ప్రశ్నిస్తే ఎలా, బిజెపితో జగన్ చర్చలు జరిపితే తప్పేమిటి?: వెంకయ్య
హైదరాబాద్: తాను ఆంధ్రప్రదేశ్కు మాత్రమే మంత్రిని కాదని, అన్ని రాష్ర్టాలకూ మంత్రిని అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా తనకు అన్ని రాష్ర్టాలు సమానమేనని అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ర్టాల ప్రజలు తనను కాదన్నారనే కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లానని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తననే ప్రశ్నించడం భావ్యం కాదని వెంకయ్య అన్నారు. యూపీఏ చేసిన తప్పు వల్లే తమ ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే ప్రత్యేక హోదా సాధించలేకపోయామని వివరించారు. ప్రత్యేక హోదా పొందే అంశాలేవీ ఏపీకి లేవని, లోటుబడ్జెట్ అన్న ఒక్క అంశమే ప్రత్యేక హోదా అడగటానికి కారణంగా ఉందని వెంకయ్య అన్నారు.
దేశవ్యాప్తంగా 11 రాష్ర్టాలు ప్రత్యేక హోదా కోరుతున్నాయని, ఏపీ లోటు బడ్జెట్ను పూరించేందుకు జాతీయ స్థాయిలో కృషి చేశానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ స్థాయిలో ల్యాండ్ పూలింగ్ చేపట్టడం అభినందనీయమన్నారు. టీడీపీ, బీజేపీ మైత్రి కొనసాగుతుందని భావిస్తున్నానని అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై తనకు ఇంకా నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అందులో తప్పేముందని బదులిచ్చారు.