హైదరాబాద్ అభివృద్ధిలో వైయస్ పాత్ర!: ఎదుటే చంద్రబాబుకు వెంకయ్య షాక్!!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాత్రికి రాత్రే ఏపీ హైదరాబాద్ అవుతుందని చాలామంది మభ్యపెడుతున్నారని, కానీ భాగ్యనగరాన్ని చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర రెడ్డి, వెంగళ రావు, ఎన్టీఆర్.. ఇలా ఏళ్ల పాటు కష్టపడితే అది అభివృద్ధి చెందిందని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మరో తొమ్మిది రాష్ట్రాలు అడుగుతున్నాయని వెంకయ్య చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పింది నిజమే అన్నారు. అయితే, ఇతర రాష్ట్రాలు అడుగుతున్నందున ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తాము హోదా ఇవ్వనప్పటికీ దానితో సమానమైన ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పారు.
విపక్షాలు ప్రత్యేక హోదా తప్ప మరేమీ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదానే పట్టుకొని వాళ్లు లాగుతున్నారని, కానీ కేంద్రం ఇచ్చే హోదాతో లబ్ధి గురించి ఆలోచించడం లేదని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు.. ఈ ఇద్దరి జోడీ అభివృద్ధికి దోహదం చేస్తోందని వెంకయ్య అన్నారు. విభజనతో నష్టపోయిన ఏపీకి సాయం చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్రం రాష్ట్రంలో అనేక సంస్థలను ఏర్పాటు చేస్తోందన్నారు. రూ.6వేల కోట్లతో ఏపీలో రక్షణ సంస్థల ఏర్పాటుకు కేంద్రం సిద్ధమైందన్నారు.
రాత్రి సమయంలో మూడు కిలో మీటర్ల దూరం చూడగలిగే లెన్స్ను బెల్ పరిశ్రమ తయారుచేస్తోందన్నారు. ఈ సంస్థ ఉత్పతుల్లో 87 శాతం రక్షణ శాఖకు చెందినవే అన్నారు. కొందరు నేతలు ఏపీకి ప్రత్యేకహోదా తప్ప మరేమీ అక్కర్లేదని అంటున్నారన్నారు. హోదాతోపాటు 28 కోరికలు కోరితే, వాటిలో 27 కోరికలు నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెంకయ్య అన్నారు.
ఇదిలా ఉండగా, వెంకయ్య హైదరాబాద్ అభివృద్ధి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయని అంటున్నారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేసానని చంద్రబాబు, తమ పార్టీ అధినేత ప్రపంచపటంలో నిలిపారని తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతుంటారు.
ఇప్పుడు వెంకయ్య మాట్లాడుతూ.. హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి ఏళ్లు పట్టిందని, అందుకు పలువురు ముఖ్యమంత్రులు కృషి చేశారని చెప్పారు. అయితే, వెంకయ్య మాటల్లో తప్పులేదని, హైదరాబాదును ప్రపంచపటంలో నిలిపింది చంద్రబాబేనని, అయితే అభివృద్ధిలో మాత్రం అందరి పాత్ర ఉన్నదనేది ఆయన అభిప్రాయమని, ఎవరు సీఎంగా ఉన్నా అంతో ఇంతో అభివృద్ధి ఉంటుందని అంటున్నారు.