కప్పు టీ తాగిన వెంకయ్య: కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు
విజయవాడ: తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బుధవారం విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీనగర్లో టీ స్టాల్ ప్రారంభించిన వెంకయ్య నాయుడు, అక్కడే టీ తాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన జీవితంలో తొలిసారి టీ తాగానని తెలిపారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఒకప్పుడు టీ బాయ్గా జీవిత ప్రస్థానాన్ని ఆరంభించారని గుర్తు చేశారు.
టీ అమ్ముకునేందుకు కాంగ్రెస్ ప్లీనరీ వద్ద స్థలం ఇస్తానని మోడీని ఉద్దేశించి ఆ పార్టీ ఎంపి మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా వెంకయ్య తప్పుపట్టారు. అయ్యర్ వ్యాఖ్యలు వేలాది మంది టీ అమ్ముకునే వారిని అవమానించడమేనని విమర్శించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు కుంభకోణాల్లో కూరుకుపోయారని అన్నారు. దేశ ప్రజలందరూ నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని వెంకయ్య తెలిపారు.
కాంగ్రెస్ ఔట్.. అందులో నో డౌట్
విజయవాడలో ఏర్పాటు చేసిన మోడీ ఫర్ పిఎం సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఔట్ అని.. అందులో నో డౌట్ అని అన్నారు. యూపిఏ హయాంలో పేదలు మరింత పేదలుగా మారారని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఉగ్రవాదం పెరిగిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కేంద్రం తప్పుడు నిర్ణయాల వల్లే రూపాయి పతనం మొదలైందని ఆరోపించారు. దేశం మొత్తం నరేంద్ర మోడీ వైపే చూస్తోందని, మోడీ ప్రధాని కావాలని కోరుకుంటోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
దేశంలో థర్డ్ ఫ్రంట్ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన చెప్పారు. దేశానికి స్థిరమైన ప్రభుత్వం కావాలని రాష్ట్రపతి చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఏ పార్టీలోనూ ఉండలేనివారంతా మూడో ఫ్రంట్ మాట చెబుతున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పేవాన్నీ ఆచరణ సాధ్యం కావని తేలిపోయిందని చెప్పారు. ప్రపంచ కార్మికులారా ఏకం కావాలని చెప్పేవారు ఏకం కారని, సిపిఐ నేత నారాయణ, సిపిఎం నేత రాఘవులును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ 2004లో, తెలుగుదేశం 2009లో విభజన కోరుకునే పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమతితో పొత్తులు పెట్టుకున్నాయని అన్నారు. అప్పుడు ఎవరూ వ్యతిరేకించలేదని అన్నారు. మీరు ఇస్తామంటే.. మేం వద్దంటామా..? అని రాష్ట్రపతి ముందే చెప్పిన సిపిఎం పార్టీ అప్పుడు మాట మారుస్తోందని ఆరోపించారు. విభజనకు ముందే అభివృద్ధి చేసి ఉంటే సీమాంధ్ర ప్రజలు నమ్మేవారని అన్నారు.
తాము అధికారంలో ఉండి విభజించాలనుకుంటే రెండు ప్రాంతాల ప్రజల్లో భరోసా కలిగించేవాళ్లమని చెప్పారు. విజయవాడ, విశాఖ, గుంటూరులలో బిజినెనెస్ స్కూల్స్ ఏర్పాటు చేసేవాళ్లమని, విశాఖకు ఐటిఐఆర్ ఇచ్చేవాళ్లమని వెంకయ్యతెలిపారు. రెచ్చగొట్టే ప్రకటనలు కాంగ్రెస్ వాళ్లే చేస్తున్నారని ఆరోపించారు. దేశం ఎవరీ సొత్తు కాదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఉండేవారిని ఎవరూ ఏం చేయలేరని, ఉద్యోగస్థులను స్వస్థలాలకు వెళ్లాలని కాంగ్రెస్ నాయకులే భయపట్టారని అన్నారు.
కాంగ్రెస్ పెద్దలు సరైన రీతిలో స్పందించి ఉంటే ప్రజల మధ్య చిచ్చు వచ్చేది కాదన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రపోజ్ చేస్తే.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిస్పోజ్ చేస్తారని ఆరోపించారు. తెలంగాణలో వెయ్యిమంది, సీమాంధ్రలో 300 మంది అమాయకులు మరణించడానికి కాంగ్రెస్ కారణమని వెంకయ్య ఆరోపించారు. తాము మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.