Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్ అక్కడే..! హైకోర్టు స్టేతో మార్పు..!
ఏపీలో ఈసారి విజయవాడలో దసరా సందర్భంగా రెండు వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో ఒకటి ఇంద్రకీలాద్రిపై ఏటా జరిగే దసరా మహోత్సవాలు కాగా.. రెండవది మైసూరు దసరా ఉత్సవాల్ని తలపించేలా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న విజయవాడ ఉత్సవ్ మరొకటి. ఇందులో ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులకు ఎలాంటి ఇబ్బందీ లేకపోయినా, భారీ ఏర్పాట్లు చేస్తున్న విజయవాడ ఉత్సవ్ వేదిక విషయంలో మాత్రం హైకోర్టు బ్రేక్ వేసింది.
విజయవాడ శివార్లలోని గొల్లపూడిలో ఉన్న దేవాదాయశాఖ భూమిలో విజయవాడ ఉత్సవ్ ఈవెంట్ నిర్వహణకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది. దేవాదాయ భూమిని వాణిజ్య కార్యకలాపాలకు ఎలా వాడుతారంటూ ప్రశ్నించింది. దీంతో నిర్వాహకులు ఇరుకున పడ్డారు. ఈ నేపథ్యంలో గొల్లపూడిలోనే ప్రత్యామ్నాయంగా మరో వేదిక కోసం అన్వేషిస్తున్నట్లు నిర్వాహక కమిటీ సభ్యుడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇవాళ ప్రకటించారు.

విజయవాడలో ఉన్న వివిధ రంగాల ప్రముఖులు ఒక సొసైటీ గా ఏర్పడి ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పట్టాభి తెలిపారు. అందులో భాగంగా అనేక ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. పున్నమి ఘాట్ లో కళలు సంప్రదాయాలు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఫైర్ వర్క్స్ కు సంబంధించిన ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయన్నారు. తుమ్మలపల్లి, ఘంటసాల సంగీత కళాశాలలో కూడా నాటక రంగానికి సంబంధించిన వివిధ కళలకు సంబంధించి స్టేజి ప్రదర్శనలు ఉంటాయని ఆయన తెలిపారు..

సెప్టెంబర్ 27 న బందర్ రోడ్ లో అమ్మవారి ఉత్సవ రథ ఊరేగింపు ఉంటుందని తెలిపారు. గొల్లపూడి వద్ద విజయవాడ ఎక్స్పో ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అందరి సహకారంతో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడను పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. అయితే గొల్లపూడి ఎక్స్పో కు సంబంధించిన భూమి విషయంలో హైకోర్టు స్టే ఇచ్చిందని, అందుకే ఆ స్థలం బదులు వేరే చోట ఈ ఎక్స్పో ను నిర్వహించేందుకు స్థలం చూస్తున్నట్లు తెలిపారు. గొల్లపూడిలో భూమికు సంబంధించి స్టే రాగానే అక్కడ పనులు ఆపేశామన్నారు. గొల్లపూడి లోనే వేరే చోట మరో స్థలం చూసి ఈ ఎక్స్ పో ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications